కుండపోత వర్షాలు.. 100 మంది మృతి.. 20 లక్షల మంది..

- July 09, 2018 , by Maagulf
కుండపోత వర్షాలు.. 100 మంది మృతి.. 20 లక్షల మంది..

కుండపోత వర్షాలతో జపాన్‌ చిగురుటాకులా వణికిపోతోంది. ప్రకృతి విలయానికి పలు ప్రాంతాలు ఇప్పటికే నీటమునిగాయి. వరదల్లో ఇప్పటివరకు వందమందికిపైగా చనిపోయారు. లోతట్టు ప్రాంతాలు నీట మనుగడంతో పడవల సాయంతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

జపాన్‌ వాసులపై ప్రకృతి ప్రకోపించింది. ఎడతెరిపి లేని వర్షాలకు దేశంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.  వరదల్లో చిక్కుకుని ఇప్పటివరకూ100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కొన్నిచోట్ల కొండ చరియలు విరిగిపడడం కూడా మరణాలకు కారణమైంది. మరో 60 మంది ఆచూకీ తెలియడం లేదు. వేలాది ఇళ్లు వరదల ఎఫెక్ట్‌కి నేలమట్టం అయ్యాయి.

దాదాపు  20 లక్షల మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. సహాయ చర్యల కోసం ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించినా లోతట్టు ప్రాంతాల్లో సాధరణ పరిస్థితి రావడానికి చాలా రోజులు పట్టేలా కనిపిస్తోంది. ప్రధాని షింజో అబే పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

గంటల వ్యవధిలోనే అతి భారీవర్షం కురవడం వల్ల పలు నగరాల్లో పరిస్థితి దుర్భరంగా మారింది. ప్రస్తుతం సహాయ చర్యల కోసం ఆర్మీని రంగంలోకి దించారు. హెలీకాఫ్టర్ల సాయంతో బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  

గురువారం నుంచి జపాన్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వీటి కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వందల సంఖ్యలో ఇళ్లు నీటమునిగాయి. వాహనాలు కొట్టుకుపోతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రంగంలోకి దిగిన జపాన్‌ సైన్యం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టింది. పడవల సాయంతో ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మరోవైపు వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కొన్ని చోట్ల వంతెనలు కూలిపోయాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. సహాయకచర్యల కోసం హెలికాప్టర్లను రంగంలోకి దించారు. దాదాపు 9లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2004 తర్వాత జపాన్‌లో మళ్లీ ఇంతటి తీవ్ర స్థాయిలో వరదలు సంభవించడం ఇదే తొలిసారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com