మరో 5గురిపై గురి..బిగుసుకుంటున్న ఉచ్చు

- February 17, 2019 , by Maagulf
మరో 5గురిపై గురి..బిగుసుకుంటున్న ఉచ్చు

హీరాగోల్ట్‌ అక్రమాల కేసులో ఆ కంపెనీ సీఈవో నౌహీరాతో పాటు మరో ఐదుగురు ప్రధాన పాత్ర పోషించారని సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు. నౌహీరా షేక్‌ సోదరుడితో పాటు సోదరి ముబారక్‌ జాన్‌ షేక్‌, సోదరుడి భార్య ఖమర్‌ జాన్‌ షేక్‌, షేక్‌ సతీనా, మహ్మద్‌ అష్రఫ్‌లను నిందితులుగా గుర్తించామని సీసీఎస్‌ పోలీసులు నాంపల్లి కోర్టుకు తెలిపారు. హీరా గ్రూప్‌ సంస్థల్లో దాదాపు 1,70,000 మంది ముదుపరులు డబ్బులను డిపాజిట్‌ చేశారు. అందులో సుమారు 22,000 మంది తాము పెట్టుబడి పెట్టిన డబ్బు వాపస్‌ ఇవ్వాలని, ఆరేడు నెలల నుంచి హీరా గోల్డ్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వారికి చెల్లించాల్సిన మొత్తం దాదాపు రూ. 650 కోట్లుగా లెక్క తేలింది. అయితే, హీరాగోల్ట్‌కు చెందిన బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.25 కోట్లు మాత్రమే ఉన్నట్లు సీసీఎస్‌ పోలీసుల సోదాల్లో గుర్తించారు. లక్షలాది మంది నుంచి సేకరించిన డిపాజిట్‌లు ఎక్కడికి తరలించారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బిగుసుకుంటున్న ఉచ్చు

అక్రమంగా పెట్టుబడుల సేకరణ కేసులో నౌహీరా షేక్‌ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆమె కార్యకలాపాలతో పాటు పలు అంశాలపై దృష్టి సారించిన సీసీఎస్‌ పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. అదే సమయంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న నౌహీరా బాధితులు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ కేవలం హీరాగోల్డ్‌ సీఈవోని మాత్రమే అరెస్ట్‌ చేసి మిగతా డైరెక్టర్‌లు పారిపోయేందుకు పోలీసులు సహకరిస్తున్నారని, నిందితురాలికి పలువురు పెద్దలు సహకరిస్తున్నరని వారు ఆరోపిస్తున్నారు.

విదేశాలకు రూ. వేల కోట్లు

ఈ కేసులో విచారణ ప్రారంభించిన సీసీఎస్‌ పోలీసులు ఆమె కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్క్‌ల ద్వారా రూ. వేల కోట్లు విదేశాలకు బదిలీ అయినట్టు గుర్తించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ సీసీఎస్‌ సిబ్బంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌, ఇన్‌కంటాక్స్‌, అధికారులకు దీనిపై లేఖలు రాశారు. సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ శాఖ ఈ కేసులో దర్యాప్తు చేపట్టాలని లేఖలో కోరారు. ఇప్పటి వరకూ జరిపిన దర్యాప్తులో హీరాగ్రూప్‌ మన దేశంలోనే డిపాజిటర్ల వద్ద నుంచి మొత్తం మీద రూ. 5,647 కోట్లు సేకరించినట్లు గుర్తించారు. యుఏఈ, కువైట్‌, సౌదీలో వంటి దేశాలనుంచి వేల కోట్ల రూపాయల డిపాజిట్‌లు సేకరించినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ దేశాల్లో డిపాజిట్‌ల సేరణలో నౌహీరా కుమారుడు అబూబకర్‌ ప్రధాన పాత్ర పోషించినట్లు గుర్తించిన సీసీఎస్‌ సిబ్బంది అబూబకర్‌ను విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో నౌహీరాతోపాటు, బిజూధామస్‌, మౌలీ ధామ్‌సలను అరెస్ట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com