చందమామకు ముప్పు?
- May 15, 2019
చందమామ కథలు చెబుతూ తన కొడుకును తల్లి లాలిస్తుంది. మిలమిల మెరిసే చంద్రున్ని చూపిస్తూ పిల్లాడికి గోరు ముద్దలు తినిపిస్తుంది. వెన్నెల చల్లదనంలో నిద్రిస్తే ఆ హాయే వేరు. ఈ ప్రపంచంలో జాబిల్లి అంటే ఇష్టం ఉండని వారంటూ ఉండరు. అలాంటి అనుభూతి పంచే చంద్రుడికి ఇప్పుడు కష్టకాలం వచ్చిపడింది. జాబిల్లి మనుగడకే ముప్పు వచ్చి పడింది. అవును నాసా శాస్త్రవేత్తల పరిశోధనల్లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
చంద్రుడు రానురాను కుంచించుకుపోతున్నట్లు నాశా పరిశోధనల్లో వెల్లడైంది. అంతర్గతంగా ఉన్న శీతల పరిస్థితుల వల్ల చందమామ వైశాల్యం క్రమంగా తగ్గుతున్నదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది. గడిచిన కొన్ని కోట్ల ఏళ్ల కాలంగా దాదాపు 150 అడుగుల మేర కుంచించుకుపోయినట్టు వెల్లడించింది. ఫలితంగా చంద్రుడి ఉపరితలంపై ముడుతలు, పగుళ్లు, ప్రకంపనలు ఏర్పడుతున్నాయని పేర్కొంది. ద్రాక్ష పండు ఎండిపోతున్నప్పుడు చర్మం ఎలా మారుతుందో.. చంద్రుడి ఉపరితలం అదేవిధంగా రూపాంతరం చెందుతున్నదని స్పష్టం చేసింది నాసా.
చంద్రుడిపై పరిశోధనల కోసం నాసా పంపిన ఎల్ఆర్వో ఎయిర్క్రాఫ్ట్ అందించిన 12 వేల ఫొటోలను, అపోలో మిషన్లలో భాగంగా చంద్రుడిపై బిగించిన సిస్మోమీటర్లు అందించిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు. ఉత్తర ధ్రువం పూర్తిగా కుంచించుకుపోయినట్లు…ఉపరితలంపై పగుళ్లు ఏర్పడుతున్నట్లు గుర్తించారు.
సాధారణంగా భూమి మాదిరిగా చంద్రుడిపై టెక్టానిక్ ప్లేట్లు ఉండవు. 450 కోట్ల ఏళ్ల కిందట చంద్రుడు ఏర్పడినప్పుడు ఈ ప్లేట్ల ఏర్పాటు ప్రారంభమైనా.. ఉష్ణోగ్రతలను కోల్పోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటినుంచి ద్రాక్షపండు పైపొర, దాని కింది గుజ్జు మాదిరిగానే చంద్రుడి ఉపరితలం, లోపలి పొరలు పెళుసుగా ఉన్నాయి. కొన్నేళ్ల తర్వాత అంతర్గతంగా అత్యంత శీతల పరిస్థితులు ఉండటంతో లోపలి పొరలు మెల్లిగా కుంచించుకుపోవడం ప్రారంభించాయి. ఈ క్రమంలో లోపలి పొరల్లోని పదార్థంలో కొంతభాగం ఉపరితలంవైపు చొచ్చుకొస్తుంది. ఫలితంగా పైపొరపై ఒత్తిడి పెరిగి పగుళ్లు రావడంతోపాటు ముడుతలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో భూకంపాల మాదిరిగా తరుచూ ప్రకంపనలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









