చందమామకు ముప్పు?
- May 15, 2019
చందమామ కథలు చెబుతూ తన కొడుకును తల్లి లాలిస్తుంది. మిలమిల మెరిసే చంద్రున్ని చూపిస్తూ పిల్లాడికి గోరు ముద్దలు తినిపిస్తుంది. వెన్నెల చల్లదనంలో నిద్రిస్తే ఆ హాయే వేరు. ఈ ప్రపంచంలో జాబిల్లి అంటే ఇష్టం ఉండని వారంటూ ఉండరు. అలాంటి అనుభూతి పంచే చంద్రుడికి ఇప్పుడు కష్టకాలం వచ్చిపడింది. జాబిల్లి మనుగడకే ముప్పు వచ్చి పడింది. అవును నాసా శాస్త్రవేత్తల పరిశోధనల్లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
చంద్రుడు రానురాను కుంచించుకుపోతున్నట్లు నాశా పరిశోధనల్లో వెల్లడైంది. అంతర్గతంగా ఉన్న శీతల పరిస్థితుల వల్ల చందమామ వైశాల్యం క్రమంగా తగ్గుతున్నదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది. గడిచిన కొన్ని కోట్ల ఏళ్ల కాలంగా దాదాపు 150 అడుగుల మేర కుంచించుకుపోయినట్టు వెల్లడించింది. ఫలితంగా చంద్రుడి ఉపరితలంపై ముడుతలు, పగుళ్లు, ప్రకంపనలు ఏర్పడుతున్నాయని పేర్కొంది. ద్రాక్ష పండు ఎండిపోతున్నప్పుడు చర్మం ఎలా మారుతుందో.. చంద్రుడి ఉపరితలం అదేవిధంగా రూపాంతరం చెందుతున్నదని స్పష్టం చేసింది నాసా.
చంద్రుడిపై పరిశోధనల కోసం నాసా పంపిన ఎల్ఆర్వో ఎయిర్క్రాఫ్ట్ అందించిన 12 వేల ఫొటోలను, అపోలో మిషన్లలో భాగంగా చంద్రుడిపై బిగించిన సిస్మోమీటర్లు అందించిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు. ఉత్తర ధ్రువం పూర్తిగా కుంచించుకుపోయినట్లు…ఉపరితలంపై పగుళ్లు ఏర్పడుతున్నట్లు గుర్తించారు.
సాధారణంగా భూమి మాదిరిగా చంద్రుడిపై టెక్టానిక్ ప్లేట్లు ఉండవు. 450 కోట్ల ఏళ్ల కిందట చంద్రుడు ఏర్పడినప్పుడు ఈ ప్లేట్ల ఏర్పాటు ప్రారంభమైనా.. ఉష్ణోగ్రతలను కోల్పోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటినుంచి ద్రాక్షపండు పైపొర, దాని కింది గుజ్జు మాదిరిగానే చంద్రుడి ఉపరితలం, లోపలి పొరలు పెళుసుగా ఉన్నాయి. కొన్నేళ్ల తర్వాత అంతర్గతంగా అత్యంత శీతల పరిస్థితులు ఉండటంతో లోపలి పొరలు మెల్లిగా కుంచించుకుపోవడం ప్రారంభించాయి. ఈ క్రమంలో లోపలి పొరల్లోని పదార్థంలో కొంతభాగం ఉపరితలంవైపు చొచ్చుకొస్తుంది. ఫలితంగా పైపొరపై ఒత్తిడి పెరిగి పగుళ్లు రావడంతోపాటు ముడుతలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో భూకంపాల మాదిరిగా తరుచూ ప్రకంపనలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్.. అబుదాబి, దుబాయ్, ఫుజైరా కనెక్ట్..ఫుల్ డిటైల్స్..!!
- బుఖా ఘటనలో ఇద్దరు విదేశీయులకు గాయాలు, వాహనాలకు నష్టం..!!
- హోర్ముజ్ జలసంధిని "బేరసారాల సాధనంగా" చేయొద్దు: ఖతార్
- బహ్రెయిన్ లో డ్రైవర్కు 7 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా యూఏఈకి సౌదీ మద్దతు..!!
- జహ్రా వైపు వెళ్లే ఐదవ రింగ్ రోడ్ ఈనెల 16 వరకు పాక్షికంగా మూసివేత..!!
- భారతీయుల పై దాడి.. ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం!
- విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం









