సంక్రాంతికి సందడి చేయనున్న చిత్రాలు..!

- January 02, 2016 , by Maagulf
సంక్రాంతికి సందడి చేయనున్న చిత్రాలు..!

నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ రామ్‌ నటించిన 'నేను..శైలజ', నాగశౌర్య నటించిన 'అబ్బాయితో అమ్మాయి' చిత్రాలు విడుదలైన విషయం విదితమే. వీటిల్లో రామ్‌ నటించిన 'నేను.. శైలజ' నూతన సంవత్సరం 2016కు శుభారంభాన్ని ఇచ్చిందం టున్నారు సినీ విశ్లేషకులు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ప్రేక్షకులు, హీరోల అభిమానుల ఆత్రుత అంతా సంక్రాంతి బరిలో విడుదలయ్యే చిత్రాల గురించే. గత సంవత్సరం సంక్రాంతి పోటీలో పెద్దగా విజయాలు సాధించిన చిత్రాలేవీ లేవు. ఈసారి అమితుమీ తేల్చు కునేందుకు నాలుగు చిత్రాలు పోటీ పడుతున్నాయి. వాటిల్లో బాబారు, అబ్బారులు బాలకృష్ణ, ఎన్టీఆర్‌ చిత్రాలు కూడా ఉండటం విశేషం. 'డిక్టేటర్‌'గా బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకొస్తుంటే, ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో..' అంటున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు అక్కి నేని నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన 'సోగ్గాడే చిన్ని నాయన', శర్వానంద్‌ 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' చిత్రాలు కూడా బరిలో ఉన్నాయి. బాలకృష్ణ 'డిక్టేటర్‌' 'లయన్‌' చిత్రం తర్వాత బాలకృష్ణ నటిస్తున్న 99వ సినిమా 'డిక్టేటర్‌'. 'లౌక్యం'తో మంచి హిట్‌ను అందుకున్న శ్రీవాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో దర్శకుడు శ్రీవాస్‌ కూడా నిర్మాణంలో భాగస్వామి కావడం విశేషం. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలవుతుంది. నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయన' నూతన దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ డైరెక్షన్‌లో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రాన్ని సంక్రాంతి రోజున విడుదల చేస్తున్నారు. అన్నపూర్ణ బ్యానర్‌పై నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ నటిస్తుండడం విశేషం. గతేడాది నాగార్జున నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడంతో ఈ చిత్రాన్ని ఆయన అభిమానులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో..' గతేడాది 'టెంపర్‌' హిట్‌తో మంచి దూకుడుమీదున్న ఎన్టీఆర్‌, సుకుమార్‌ దర్శకత్వంలో 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో నటించారు. ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తొలిసారి నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తు న్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలైంది. తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని సుకుమార్‌ తెరకెక్కిం చిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతూ సంక్రాంతి బరిలో ఉంది. శర్వానంద్‌ 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' ఈసారి శర్వానంద్‌ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంది. గతేడాది 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' వంటి ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ సినిమా తర్వాత ఆయన చేస్తున్న చిత్రమిది. సురభి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్‌ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 14వ తేదీనే విడుదల కానుంది. దీంతో ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని పంచబోతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com