'జీవన్ లాభ్' బీమా పాలసీని నేటి నుంచి జారీ..

- January 03, 2016 , by Maagulf
'జీవన్ లాభ్' బీమా పాలసీని నేటి నుంచి జారీ..


* పరిమితకాలం ప్రీమియం చెల్లింపు సౌలభ్యం * నేటి నుంచి అందుబాటులోకి భారత జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) పరిమిత కాలం ప్రీమియం చెల్లించే కొత్త ఎండోమెంట్ ఎష్యూరెన్స్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పేరుతో ఈ బీమా పాలసీని నేటి(సోమవారం) నుంచి జారీచేస్తున్నట్లు ఎల్‌ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పాలసీని 8 నుంచి 59 సంవత్సరాల వయస్సున్న ఎవరైనా తీసుకోవచ్చని, పాలసీ టర్మ్ 16/21/25 సంవత్సరాలు ఉంటుందని, ప్రీమియమ్‌లు 10/15/16 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది.పాలసీ మెచ్యూర్ అయ్యేనాటికి వ్యక్తి గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు ఉండాలని పేర్కొంది.
పాలసీ టర్మ్ పూర్తయిన తర్వాత పాలసీదారుడికి కనీస బీమా రక్షణ మొత్తం, రివర్సిషనరీ బోనస్‌లు, తుది అదనపు బోనస్‌లు, తదితర ప్రయోజనాలు లభిస్తాయని వివరించింది. ఒకవేళ పాలసీ అమలుకాలంలో పాలసీదారుడు మరణిస్తే, కనీస బీమా రక్షణ మొత్తం గానీ, పాలసీ దారుడు చెల్లించిన వార్షిక ప్రీమియానికి గరిష్టంగా పదిరెట్ల మొత్తం గానీ చెల్లిస్తామని, రివర్షనరీ బోనస్‌లు, తుది అదనపు బోనస్‌లు, తదితర ప్రయోజనాలు కూడా లభిస్తాయని వివరించింది.ఈ మొత్తం... పాలసీదారుడు మరణించేనాటికి చెల్లించిన మొత్తం ప్రీమియానికి 105 శాతం కంటే తక్కువ కాకుండా ఉంటుందని పేర్కొంది. కనీస బీమా రక్షణ రూ.2,00,000 అని, గరిష్ట బీమా రక్షణకు పరిమితి లేదని పేర్కొంది. అదనపు ప్రీమియం చెల్లించి ఎల్‌ఐసీ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటి బెనిఫిట్ రైడర్(ఏడీ అండ్ డీబీ), ఎల్‌ఐసీ న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్‌లు పొందవచ్చని వివరించింది. తక్కువ కాలం ప్రీమియం చెల్లించి పాలసీ టర్మ్ పూర్తయ్యే వరకూ బీమా కవరేజి పొందడం ఈ పాలసీ ప్రత్యేకత అని ఎల్‌ఐసీ పేర్కొంది. తక్కువ కాలం ప్రీమియం చెల్లించి ఎక్కువ కాలం బీమా కవరేజ్ కావాలనుకునే వారికి ఇది తగిన విధంగా ఉంటుందని పేర్కొంది. ప్రీమియం నెల/మూడు నెలలకు/ఆరు నెలలకు/సంవత్సరానికొకసారి చెల్లించవచ్చని, రుణ సౌకర్యం లభిస్తుందని వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com