లయహారి:

- August 23, 2019 , by Maagulf
లయహారి:

"లయహారి" అనేది ఒక పద్యలక్షణం. చూడడానికి తేలిగ్గా పాడుకునేలా కనిపిస్తున్నా ఈ లక్షణంలో వ్రాయడం కొంత కష్టమే. కారణం ఏమిటంటే ప్రతి పాదంలోనూ ఆఖరి రెండు అక్షరాలు తప్ప అన్నీ లఘువులే ఉండాలి. ప్రతిపాదంలోనూ 37 అక్షరాలుండాలి. ప్రతి పాదంలోనూ 1,11,21, 31 అక్షరాలకు యతి గానీ, ప్రాసయతి గాని పడాలి. ప్రతి పాదంలోనూ రెండవ అక్షరం ఒకే అక్షరానికి చెందాల్సిన ప్రాసనియమం సరేసరి. మొత్తానికి ప్రయత్నిస్తే ఇలా తయారయింది.

పద్యం:
అధరములు మెరవగనె వధసలుపనసురులను, కుధరమును కుదుపగనె మధురపులకించెన్ 
మధురమగు మురళిసడి సుధగమరి కురియగనె బుధజనులు మురియగనె మధురపులకించెన్ 
వ్యధలణచ మురిపెముగనధనునికి ధనమొసగి మధువులను చిలుకగనె మధురపులకించెన్ 
దధిచిలికినటులమరి విధివిధము తెలుపగనె గ్రథితమగు కవితలకు మధురపులకించెన్

భావం: 
మందహాసంతో పెదవులు మెరిస్తూ ఉండగానే రాక్షసులను చంపగా, గోవర్ధన పర్వతాన్ని కుదిపి ఎత్తగా మధురానగరం పులకించింది. మధురమైన వేణుగానం అమృతంలా కురవగా, సత్పురుషులు ఆనందపడగా మధురానగరం పులకించింది. బాధలను పోగొట్టే విధంగా ప్రేమతో ధనంలేని కుచేలుడికి ధనమొసగగా మధురానగరం పులకించింది. పెరుగు చిలికినంత చక్కగా విధివిధానాలు తెలిపే కవిత్వంతో భగవద్గీతా గ్రంథాన్ని అందించగా మధురానగరం పులకించింది.

-సిరాశ్రీ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com