మస్కట్ నుండి మాతృభూమికి చేరనున్న 13 మంది ప్రవాసి కార్మికులు

- September 11, 2019 , by Maagulf
మస్కట్ నుండి మాతృభూమికి చేరనున్న 13 మంది ప్రవాసి కార్మికులు

ఒమన్:మస్కట్ లోని హాసన్ జుమా బాకర్ అనే భవన నిర్మాణ కంపెనీలో తెలంగాణకు చెందిన 45 మంది కార్మికులు ఏడాదికాలంగా వేతనాలు ఇవ్వనందున ఎడారిలో అష్టకష్టాలు పడుతున్నారు. వేతన బకాయిల కోసం ఇండియన్ ఎంబసీ సహాయంతో మస్కట్ లేబర్ కోర్టులో కేసులు దాఖలు చేశారు. బుధవారం (11.09.2019) రాత్రి వీరు ఉట్టి చేతులతో మస్కట్ నుండి హైదరాబాద్ కు బయలు దేరుతున్న విషయం తెలుసుకున్న 'ఓమాన్ తెలంగాణ ఫ్రెండ్స్' అనే సామాజిక సేవా సంస్థ కన్వీనర్ నరేంద్ర పన్నీరు వీరిని లేబర్ క్యాంపులో కలుసుకొని జేబు ఖర్చులకు ఒక్కొక్కరికి రూ. 500 నగదు సహాయం అందజేశారు. వీరిలో 11 మంది తెలంగాణ వారు కాగా, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక లకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు. వీరంతా ఏరిండియా విమానంలో హైదరాబాద్ విమానాశ్రయానికి గురువారం (12.09.2019) తెల్లవారు జామున చేరుకుంటారు.

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన గనిశెట్టి శ్రీనివాస్ ఈ సంధర్భంగా మాట్లాడుతూ.. ఒక్కొక్క కార్మికునికి రూ.1 లక్షా 50 వేల నుండి రూ.2 లక్షల 50 వేల వరకు జీతం బకాయిలు రావాల్సి ఉన్నాయని, తెలంగాణకు చెందిన 45 మంది కార్మికులకు కంపెనీ యాజమాన్యం రూ. ఒక కోటి వరకు బాకీ పడ్డారని అన్నారు. ఎడారిలో ఒక్కొక్క చెమటచుక్క ఒక్క రూపాయితో సమానమని, తమ కష్టార్జితాన్ని మన భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సంధర్భంగా నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ... వేతన బకాయిల కోసం న్యాయపోరాటానికి ఇండియన్ ఎంబసీ కృషి చేస్తుందని, కార్మికులు అధర్య పడవద్దని అన్నారు. స్వగ్రామాలకు చేరినంక కుటుంబాలతో, సమాజంతో ఎప్పటిలాగా పునరేకీకరణ చెందాలని, జీవితంలో స్థిరపడటానికి కృషిచేయాలని అన్నారు. గల్ఫ్ దేశాల నుండి వాపస్ వచ్చిన కార్మికులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నరేంద్రతో పాటు సంస్థ సభ్యులు మంచికట్ల కుమార్, వడ్ల గంగాధర్, బొక్కెన దేవేందర్ లు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com