బోటు ప్రమాదం: మరో 14 మృతదేహాలు లభ్యం..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- September 17, 2019
తూర్పుగోదావరి: జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాదం ఘటనలో గల్లంతయిన మృతదేహాలు ఒక్కొక్కటిగా లభిస్తున్నాయి. మంగళవారం ఉదయం 14 మృతదేహాలను గాలింపు సిబ్బంది కనుగొన్నారు. ప్రమాద స్థలం కచ్చులురు వద్ద నాలుగు, దేవీపట్నంలో 8, ధవలేశ్వరం వద్ద నాలుగు పోలవరం, పట్టిసీమ, తాళ్లపూడిలో ఒక్కో మృతదేహాలు లభించాయి. మిగిలిన వాటి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, నేవీ, విపత్తు నివారణ బృందాల గోదావరిని జల్లెడ పడుతున్నాయి. గాలింపు కోసం చత్తీస్గఢ్, గుజరాత్ నుంచి ప్రత్యేక సిబ్బందిని రప్పించారు. ఇప్పటి వరకు లభించిన మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన మృతదేహాలన్నీ బోట్కు దిగువన లేదా బోట్ మొదటి అంతస్తులోని ఏసీ క్యాబిన్లో చిక్కుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 22 మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. కచ్చులూరు మందం వద్ద ప్రమాదానికి గురైన బోటు గోదావరి ఉపరితలం నుంచి 315 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. మరోవైపు ప్రమాద స్థలానికి ఇరువైపులా ఎత్తైన కొండలున్నాయి. ఈ రెండు కారణాల వల్ల బోటును వెలికి తీయటం చాలా కష్టంతో కూడుకున్న పని అని నేవీ, పోర్టు వర్గాలు చెబుతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో బోటును వెలికి తీయడానికి ఉపయోగించే క్రేన్లను అక్కడకు తరలించటం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో బోట్ల సహాయంతోనే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుంది. కాగా లాంచీలోని మొత్తం 73 మందిలో 27 మంది సురక్షితంగా బయటకురాగా 46 మంది గల్లంతయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం