దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి పై కన్నేసిన పోలీస్ అధికారి

- September 29, 2019 , by Maagulf
దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి పై కన్నేసిన పోలీస్ అధికారి

బతిండా: పంజాబ్‌లోని మౌర్ మండీ పోలీస్ స్టేషన్  హౌస్ ఆఫీసర్ ను ఎన్నారై నుంచి రెండు కిలోల బంగారం దొంగిలించిన కేసులో పోలీస్ ఉన్నతాధికారులు శనివారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే... రాజస్థాన్‌లోని నాగోర్‌కు చెందిన మహ్మద్ రఫీక్ తన స్నేహితులు లియాఖత్, మహ్మద్ యూనస్‌తో కలిసి దుబాయ్ నుంచి వచ్చిన మిత్రుడు మహ్మద్ ఇమ్రాన్‌ను రిసీవ్ చేసుకోవడానికి శుక్రవారం అమృత్‌సర్ వెళ్లాడు. ఇమ్రాన్‌ను తీసుకొని తిరిగి తమ వాహనంలో నాగోర్‌కు వస్తున్నారు ఆ నలుగురు మిత్రులు. అయితే, మార్గం మధ్యలో ఒక ధాబా వద్ద వారి వాహనాన్ని ఒక బ్లాక్ ఇన్నోవా కారులో వచ్చిన వ్యక్తి ఆపాడు. తనను తాను స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసీ పరాశర్‌గా పరిచయం చేసుకున్న సదరు వ్యక్తి వారి కారులో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయంటూ తనిఖీ చేయడం ప్రారంభించాడు.

ఆ తరువాత కొంత సమయానికి అక్కడ మరో వాహనం వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఇద్దరు వ్యక్తులు ఆ నలుగురు స్నేహితులను మౌర్ మండీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అన్యాయంగా నాలుగు గంటలపాటు కూర్చొబెట్టారు. ఆ సమయంలో వారి వద్ద ఉన్న ప్రతి వస్తువు పోలీసులు తీసుకున్నారు. దుబాయ్ నుంచి ఇమ్రాన్ తీసుకొచ్చిన 2 కిలోల బంగారం కూడా లాక్కున్నారు. ఇదేంటని అడిగితే దిక్కు ఉన్న చోట చెప్పుకొమని ఆ నలుగురిని బయటకు పంపించేశారు. దీంతో బాధితులు పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించారు.

తమ వద్ద నుంచి అన్యాయంగా రెండు కిలోల బంగారం లాక్కున్నారని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు స్టేషన్ హౌస్ ఆఫీసర్  కేసీ పరాశర్‌తో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. బతిండా సీనియర్ సూపెర్టిండెంట్ ఆఫ్ పోలీస్  నానక్ సింగ్ మాట్లాడుతూ ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని వారిపై అపహరణ, దోపిడీ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను అరెస్టు చేసినప్పటికీ బంగారం ఇంకా దొరకలేదని చెప్పిన ఆయన దర్యాప్తు కొనసాగుతుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com