అమ్మాయి పెళ్లికి '10 గ్రాముల బంగారం'.. ప్రభుత్వం కొత్త పథకం

- November 21, 2019 , by Maagulf
అమ్మాయి పెళ్లికి '10 గ్రాముల బంగారం'.. ప్రభుత్వం కొత్త పథకం

తెలుగు రాష్ట్రాల్లో 'కళ్యాణ లక్ష్మి' అని, 'వైఎస్ఆర్ పెళ్లి కానుక' పేరుతో కొత్త పెళ్లి కూతుళ్లకు ఆర్థిక ఆసరా కల్పిస్తూ పథకాలు ప్రవేశపెట్టాయి. తాజాగా అస్సోం రాష్ట్ర ప్రభుత్వం కూడా 'అరుంధతి బంగారు పథకం' పేరుతో పెళ్లి చేసుకునే ప్రతి ఆడపడుచుకి 10 గ్రాముల బంగారం కానుకగా అందించే పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకానికి అర్హులు కావాలంటే అమ్మాయి కనీసం పదవ తరగతి వరకు చదువుకుని ఉండాలి.

వివాహం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ పథకం కింద అర్హులుగా గుర్తిస్తారు. వచ్చే ఏడాది జనవరి 1నుంచి ఈ స్కీమ్ అమలులోకి రానుంది. బాల్యవివాహాలను అరికట్టడం, బాలికా విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు అసోం ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. రాష్ట్రంలో ఏడాదికి దాదాపు 3 లక్షల మంది వివాహాలు చేసుకుంటుంటే అందులో 50 వేల వివాహాలు మాత్రమే రికార్డుల్లో నమోదు అవుతున్నాయి. ఈ పథకం ద్వారా రిజిస్ట్రేషన్ నమోదు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువ వుంటే మాత్రం ఈ పథకానికి అర్హులు కారు. వధువు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకున్న వెంటనే ఆమె పేరు మీద బ్యాంక్ ఖాతాలో బంగారం కొనుగోలు నిమిత్తం రూ.30 వేలు జమ అవుతుంది. మిగతా మొత్తాన్ని పెళ్లి అయిన వెంటనే ఇచ్చేస్తారు. అయితే బంగారం కొనుగోలు చేసినట్టు అధికారులకు రశీదు సమర్పించవలసి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com