నిర్భయ దోషుల కోసం ఉరితాళ్లు తయారు చేస్తున్న స్పెషలిస్ట్
- December 09, 2019
పాట్నా (బీహార్) : నిర్భయ దోషులను ఉరి తీయడం కోసం బీహార్ రాష్ట్ర ఖైదీలు ఉరితాళ్లను సిద్ధం చేస్తున్న ఉదంతం వెలుగుచూసింది. ఢిల్లీలోని తీహార్ జైలులో నిర్భయ కేసులో నలుగురు దోషులకు త్వరలో ఉరి తీయనున్న నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలోని బుక్సర్ సెంట్రల్ జైలు ఖైదీలు ఉరితాళ్లు పేనుతున్నారు. గతంలో పార్లమెంటుపై దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురును 2013 ఫిబ్రవరి 9వతేదీన ఉరి తీశారు. నాడు అఫ్జల్ గురును ఉరితీసేందుకు వినియోగించిన ఉరితాడును బుక్సర్ జైలు ఖైదీలే తయారు చేశారు. బీహార్ రాష్ట్రంలోని గంగా నదీ తీరంలో ఉన్న బుక్సర్ సెంట్రల్ జైలు ఉరితాళ్ల తయారీలో ప్రసిద్ధి చెందింది.
జైలు సీనియర్ అధికారుల ఆదేశంతో తాము పది ఉరితాళ్లను నిర్భయ నిందితుల ఉరి కోసం సిద్ధం చేస్తున్నామని బుక్సర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ విజయ్ కుమార్ అరోరా వెల్లడించారు. నిర్భయ కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించవద్దని కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు విన్నివించిన నేపథ్యంలో మూడు రోజుల క్రితమే ఉరితాళ్లు సిద్ధం చేయాలని బుక్సర్ జైలుకు ఆదేశాలు వచ్చాయి. ఏడుగురు ఖైదీలు నాలుగురోజుల పాటు శ్రమించి థ్రెడ్ తో కూడిన ఉరితాళ్లను పేనుతున్నారు. గతంలో అఫ్జల్ గురు ఉరి కోసం ఉరితాళ్లు తయారు చేసిన ఖైదీలే నిర్భయ దోషుల ఉరి కోసం కూడా ఉరితాళ్లను తయారు చేసే పనిలో పడ్డారు.
గతంలో అఫ్జల్ గురు కోసం పేనిన ఉరితాడును 1725 రూపాయలకు తీహార్ జైలుకు విక్రయించారు.ప్రస్థుతం రా మెటీరియల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఉరితాడు ధర కూడా పెరిగిందని బుక్సర్ సెంట్రల్ జైలు అధికారులు చెప్పారు. ఉరి తీసే ఖైదీ ఎత్తు కంటే 1.6 రెట్లు పెద్ద ఉరితాడును తయారు చేస్తున్నామని ఓ జైలు అధికారి వెల్లడించారు.
ఈ ఉరితాడు తయారీ కోసం థ్రెడ్ను గయ నగరంలోని మాన్పూర్ లోని వస్త్ర వ్యాపారుల నుంచి తెప్పించారు. గతంలో పంజాబ్ రాష్ట్రంలోని భటిండా నుంచి ఉరితాడుకు థ్రెడ్ కొనేవారు. దేశంలోని అన్ని జైళ్లకు బుక్సర్ సెంట్రల్ జైలు నుంచి ఉరితాళ్లను సప్లయి చేస్తున్నామని బుక్సర్ జైలు సూపరింటెండెంట్ చెప్పారు. ఉరి శిక్ష విధించేటపుడు మనీలా ఉరితాడు ఫెయిల్ అవ్వదు. 1930 వ సంవత్సరం నుంచి మనీలా బ్రాండ్ ఉరితాడును బుక్సర్ సెంట్రల్ జైలులోనే తయారు చేస్తున్నారు. భాగల్ పూర్ సెంట్రల్ జైలులో 1992, 1995 సంవత్సరాల్లో ఉరిశిక్ష విధించినపుడు ఉరితాళ్లను బుక్సర్ జైలు నుంచి సరఫరా చేశారు. 2004వ సంవత్సరంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అత్యాచారం చేసిన దోషి ధనుంజయ్ చటర్జీని ఉరితీసినపుడు కూడా బుక్సర్ జైలు ఖైదీలు తయారు చేసిన ఉరి తాడునే ఉపయోగించారు. ఉరితాళ్లను ముందుగానే తాము తయారు చేసి, సకాలంలో తీహార్ జైలుకు అందించేలా చర్యలు చేపట్టామని జైళ్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ మిథిలేష్ మిశ్రా చెప్పారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







