షిర్డీలో నిరవధిక బంద్..

- January 19, 2020 , by Maagulf
షిర్డీలో నిరవధిక బంద్..

షిర్డీ:మహారాష్ట్రలో సాయిబాబా జన్మస్థల వివాదం ముదురుతోంది. ఇవాళ్టి నుంచి షిర్డీవాసులు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ ప్రభావం మాత్రం ఆలయంపై ఉండబోదని సంస్థాన్ ట్రస్ట్ సీఈఓ దీపక్‌ ముగాలికర్‌ స్పష్టం చేశారు. ఆలయ దర్శనాలు, పూజలు, తదితర కార్యక్రమాలన్నీ కూడా యధావిధిగా కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. దర్శనం నిమిత్తం విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామన్నారు.

బాబా జన్మస్థలమైన పాథ్రీని భక్తుల సౌకర్యార్ధం అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు మహా సీఎం ఉద్దవ్ థాక్రే ఇటీవల ప్రకటించడంతో వివాదం రాజుకుంది. పాథ్రీ అభివృద్ధితో షిర్డీ ఆలయ ప్రాముఖ్యత తగ్గిపోతుందని స్థానికులు, పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి తమ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. దీనికి బీజేపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ వీఖే పాటిల్ కూడా మద్దతు తెలిపారు.

అయితే బాబా జన్మస్థలం పాథ్రీనేనని దానిని రుజువు చేయడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ఎన్సీపీ ఎమ్మెల్యే దుర్రాని అబ్దుల్లా ఖాన్ స్పష్టం చేశారు. తమ దగ్గర 29 సాక్ష్యాలు ఉన్నాయన్నారు. 1950వ సంవత్సరం నుంచి బాబా పాథ్రీలోనే ఉన్నారనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా 1988లో బాబా నివసించిన ప్రదేశంలో సాయి జన్మస్థాన్ మందిర్‌ను స్థానికులు నిర్మించారని చెప్పుకొచ్చారు. ఇకపోతే పాథ్రీ డిమాండ్ ఇప్పటిది కాదని.. రామ్‌నాధ్ కోవింద్ మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడే పాథ్రీ అభివృద్ధి కోసం అప్పటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను రూ.100 కోట్లు అడిగారని స్పష్టం చేశారు. కానీ ఆయన స్పందించలేదని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com