వివేకా హత్యకేసులో ఊహించని మలుపులు..తనకు ప్రాణహాని ఉందని వివేకా కుమార్తె సునీత లేఖ

- January 29, 2020 , by Maagulf
వివేకా హత్యకేసులో ఊహించని మలుపులు..తనకు ప్రాణహాని ఉందని వివేకా కుమార్తె సునీత లేఖ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని వివేకా కుమార్తె సునీత హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ పై ఏపీలో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. ఇక అంతే కాదు తనకు కొందరి మీద అనుమానం ఉందని సునీత జాబితాను కూడా ఇవ్వటం, అందులో వై ఎస్ బంధుగణం ఉండటం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇక వివేకా కుమార్తె సునీత ఆరోపణలు సంచలనంగా మారిన క్రమంలో తాజాగా ఆమె రాసిన మరో లేఖ ఇప్పుడు షాకింగ్ అంశాలను బయటకు తెస్తుంది.

తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని లేఖ రాసిన సునీత
తనకు,అలాగే తమ కుటుంబానికి, ఈ కేసులో కీలక వ్యక్తులుగా భావిస్తున్న కొంత మందికి ప్రాణహాని ఉందని కోర్టుకు, పోలీసులకు సునీత లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ఇక ఆమె రాసిన లేఖలో తనకు,తన భర్త రాజశేఖర్ రెడ్డి తో పాటు కేసులో అత్యంత కీలకంగా ఉన్న వాచ్‌మెన్ రంగయ్య, ఎర్రగంగిరెడ్డిలతో పాటు మరికొంత మంది ప్రాణహాని ఉందని వారందరికీ రక్షణ కల్పించాలని పోలీసులకు లేఖ రాసినట్లుగా సమాచారం.

వై ఎస్ జగన్ కు తలనొప్పిగా సునీత సీబీఐ దర్యాప్తు పిటీషన్
సునీత హైకోర్టులో వేసిన పిటిషన్‌పైనే ఇప్పుడు వైఎస్ జగన్ కుటుంబంలో ఒకింత అసహనం కనిపిస్తోంది. కుటుంబసభ్యులపై అనుమానాలు వ్యక్తం చేయడం ఏమిటన్న చర్చ ఓ వైపు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలను కూడా సోదరి సునీత లెక్క చేయడం లేదనే ఆగ్రహం మరో వైపు ఉన్నాయని అంటున్నారు. కానీ తన తండ్రి మరణం ఎలా జరిగింది? హంతకులు ఎవరు అన్నది ఇప్పటికీ కనిపెట్టలేకపోవటం వివేకా కుటుంబంలో పలు అనమానాలకు ఆజ్యం పోస్తుంది. అయితే ఈ విషయంలో ఎవరి ఒత్తిడిని లెక్క చేయకూడదన్న ఉద్దేశంతో వివేకా కుటుంబసభ్యులు ఉన్నారని సమాచారం.

సీబీఐ విచారణకు జగన్ నో ... సీబీఐ దర్యాప్తు కోరిన సోదరి సునీత
గత ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య ఘటన తర్వాత కుమార్తె సునీత రాజకీయ కారణమే తన తండ్రి మరణానికి కారణమై ఉంటుందని భావించారు . సోదరుడు జగన్ కేసును త్వరగా తెలుస్తాడని భావించినా అది సాధ్యం కాలేదు. అంతేకాదు సీబీఐ విచారణ అవసరం లేదని సిట్ దర్యాప్తు చేస్తుందని చెప్పుకొచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . ఇక ఈ నేపధ్యంలో సునీత సీబీఐ దర్యాప్తు చెయ్యాలని కోరటం వైఎస్ ఫ్యామిలీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత గొడవలను తెరమీదకు తీసుకు వచ్చాయి అన్న భావన కలుగుతుంది.

వెలుగులోకి వస్తున్న వైఎస్ కుటుంబంలో అంతర్గత కలహాలు
వైఎస్ సోదరుల్లో కొన్నాళ్ల నుంచి సఖ్యత లేదన్న ప్రచారం పులివెందులలో ఉంది. గత ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా తనకు ఎంపీ టిక్కెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారని అయితే.. వైఎస్ అవినాష్ రెడ్డి.. ఆయన తండ్రి దీనికి ఒప్పుకోలేదని అంటున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి, వైఎస్ భాస్కర్ రెడ్డి స్వయంగా వివేకా సోదరుడు. గతంలో ఇద్దరూ కలిసి వ్యాపారాలు చేశారు. వ్యాపారాల్లో వివాదాలు వచ్చి విడిపోయారు. అప్పట్నుంచి మాట్లాడుకోరని స్థానికులు చెప్తారు.

వై ఎస్ సోదరుడు భాస్కర్ రెడ్డి , ఆయన తనయుడు అవినాష్ రెడ్డిలను అనుమానితులుగా పేర్కొన్న సునీత
ఇక అలాంటి సమయంలో సునీత అనుమానితుల జాబితాలో ప్రధానంగా వై ఎస్ అవినాష్ రెడ్డి , ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి , అవినాష్ రెడ్డి సన్నిహితుల పేర్లు ప్రస్తావించటంతో ఈ కేసు కీలక మలుపు తిరుగుతుందని భావిస్తున్నారు. ఇక తాజాగా తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని సునీత లేఖ రాయటం కేసులో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠకు కారణం అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com