జాను:రివ్యూ

- February 07, 2020 , by Maagulf
జాను:రివ్యూ

నటీ నటులు : సమంత , శర్వానంద్ తదితరులు..
దర్శకత్వం : ప్రేమ్ కుమార్
నిర్మాతలు: దిల్ రాజు
మ్యూజిక్ : వసంత్ గోవింద
విడుదల తేది : ఫిబ్రవరి 07, 2020

రివ్యూ : జాను 

శర్వానంద్, సమంత జంటగా ప్రేమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం జాను. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 96 చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అందులో విజయ్ సేతుపతి, త్రిష పోషించిన పాత్రలను తెలుగులో శర్వానంద్, సమంత పోషించారు. ఒరిజినల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేసాడు.
అగ్ర నిర్మాత దిల్ రాజు ఎంతో మనసు పడి నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి దిల్ రాజు మనసు దోచిన జాను తెలుగు ప్రేక్షకుల మనసు దోచిందా..లేదా..? మాతృకను చెడకొట్టకుండా రీమేక్ ను ఎంత వరకు తీసి సక్సెస్ అయ్యారు..? సామ్ , శర్వా పాత్రలకు ప్రాణం పోశారా లేదా..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

ట్రావెల్ ఫొటోగ్రాఫర్‌ రామచంద్ర(శర్వానంద్‌) తన స్టూడెంట్‌తో వైజాగ్ వస్తాడు. అక్కడి వాతావరణం చూడగానే తన గత జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. వెంటనే తనతో పాటు 10వ తరగతి చదువుకున్న స్నేహితులకు కాల్ చేసి మాట్లాడుతాడు. ఆ క్రమంలో అందరూ హైదరాబాద్‌లో రీ యూనియన్ కావాలనుకుంటారు. అప్పుడు రామచంద్ర, జానకి దేవి(సమంత )ని కలుసుకుంటాడు. దాదాపు 17 సంవత్సరాలు తర్వాత కలుసుకున్న ఈ ఇద్దరు.. 10వ తరగతి చదువుకునేటప్పుడు జరిగిన విషయాల గురించి..విడిపోయిన దాని గురించి మాట్లాడుకుంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. జానుకి పెళ్లై ఉంటుంది. కానీ రామచంద్ర మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. మరి వీరిద్దరూ 10 వ తరగతి లో ఎందుకు విడిపోతారు..? రామచంద్ర ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉంటాడు..? వీరిద్దరి లో మళ్లీ ప్రేమ చిగురిస్తుందా..? అసలు ఏం జరుగుతుంది..? అనేది మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* సమంత - శర్వానంద్ యాక్టింగ్

* మ్యూజిక్

* ప్రేమ - స్కూల్ సన్నివేశాలు

మైనస్ :

* కాస్త స్లో గా ఉండడం

నటీనటుల పెర్పామెన్స్ :

* మాతృక భాషలో విజయ్ సేతుపతి - త్రిష లు నటించగా..తెలుగు లో శర్వా, సమంత ఇద్దరు ఏమాత్రం వారికీ తీసిపోని రీతిలో నటించారు. ఈ పాత్రలు చేసారు అనేదానికన్నా ప్రాణం పోశారని చెప్పాలి. రామ్ పాత్రలో శర్వా.. జానకి పాత్రలో సమంత ఒదిగిపోయారు. చక్కగా ఫీల్‌ను క్యారీ చేశారు.

పదవ తరగతిలో పుట్టిన ప్రేమ.. అనుకోని పరిస్థితుల్లో విడిపోవడం.. 17 ఏళ్ల తర్వాత కలుసుకున్నప్పుడు వారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేదే ఎంతో చక్కగా చేసారు. వీరిద్దరిని తెరపై చూస్తున్నంత సేపు అక్కడ వారు కాదు తామే ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. కథ ఎంత కూడా ఈ రెండు పాత్రల చుట్టూనే నడుస్తుండం తో అంత వీరే ఉంటారు.

* వెన్నెలకిషోర్‌, తాగుబోతు రమేష్‌, తనికెళ్ల భరణి, రఘుబాబుతో పాటు జూనియర్ శర్వానంద్‌గా నటించిన సాయికిరణ్‌, జూనియర్ సమంతగా నటించిన గౌరి చక్కగా నటించారు.

సాంకేతిక విభాగం :

* గోవింద సంగీతం సినిమాకు ప్రాణం పోసింది..చక్కటి బ్యాక్ గ్రౌండ్ తో పాటు పాటలు కూడా చక్కగా కుదిరాయి.

* మహేంద్రన్ సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది.

* మిర్చి కిరణ్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

* నిర్మాణ విలువలు కథ కు తగ్గట్లు ఉన్నాయి.

* డైరెక్టర్ ప్రేమ్‌కుమార్‌ విషయానికి వస్తే..తమిళంలో ఎలాగైతే తెరకెక్కించారో..తెలుగు లోను చిన్న చిన్న మార్పులు చేసి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. సినిమా అంత కూడా రెండు పాత్రల చుట్టూ..పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ చాల చక్కగా నడిపించాడు. శర్వా , సామ్ ఇద్దరు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేయడం తో డైరెక్టర్ విజయం సాధించినట్లు అయ్యింది. ఇలాంటి కథ కు వీరిద్దరిని ఎంచుకోవడంలోనే ప్రేమ్‌కుమార్‌ సగం సక్సెస్ అయ్యాడు. తెరపై అంతే విధంగా వారిద్దరిని చూపించి , ప్రేమ , ఎమోషనల్ , కామెడీ ఇలా అన్ని సమపాలనలో ఉండేలా తెరకెక్కించారు. కాకపోతే కాస్త స్లో గా నడవడం ప్రేక్షకులకు ఇబ్బంది గా మారింది.

ఓవరాల్ గా .. ఎమోషనల్ లవ్ స్టోరీ గా సాగిన జాను.
మాగల్ఫ్ రేటింగ్ : 3.5/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com