దుబాయ్‌కి వెళుతున్న ఎమిరేట్స్ విమానాన్ని ఎక్కేసిన కరోనా వ్యక్తి!

- March 15, 2020 , by Maagulf
దుబాయ్‌కి వెళుతున్న ఎమిరేట్స్ విమానాన్ని ఎక్కేసిన కరోనా వ్యక్తి!

కొచ్చి: కరోనా వైరస్‌ సోకిన ఓ వ్యక్తి విమానంలోకి ఎక్కడంతో అందులో ఉన్న 289 మంది ప్రయాణికుల్ని దింపేయాల్సి వచ్చింది. ఈ ఘటన కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌ నుంచి వచ్చిన 19 మంది పర్యాటకుల బృందం కేరళలోని మున్నార్‌లో సందర్శిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వీరిని అధికారులు కొన్ని రోజుల పాటు మున్నార్‌లోనే ఓ ప్రత్యేక కేంద్రంలో ఉంచారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఫలితాల కోసం వేచిచూస్తున్నారు. ఇంతలో ఆ బృందం అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కొచ్చి విమానాశ్రయానికి చేరుకొని దుబాయ్‌కి వెళుతున్న ఎమిరేట్స్ విమానాన్ని ఎక్కారు. ఈలోపు వారి వైద్య పరీక్షల ఫలితాలు వచ్చాయి. వారిలో ఒకరికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అతని కోసం గాలించగా.. విమానాశ్రయం చేరుకున్నట్లు తెలిసింది. హుటాహుటిన విమానాశ్రయ సిబ్బందికి సమాచారం చేరవేయగా వారిని విమానం నుంచి కిందకు దింపేశారు. తొలుత ఆ 19 మందినే ఆపాలనుకున్నా.. ముందు జాగ్రత్త చర్యగా విమానంలో ఉన్నవారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం వారిని ఆస్పత్రికి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com