ఏపీ 3 రాజధానులు: తొలిసారి మోడీ స్పందన

- March 17, 2020 , by Maagulf
ఏపీ 3 రాజధానులు: తొలిసారి మోడీ స్పందన

మూడు రాజధానుల అంశంపై ఆంధ్రప్రదేశ్ కి చెందిన పార్లమెంటు సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ రాసిన లేఖకు స్పందించారు మోడీ.

మూడు రాజధానుల అంశంలో జగన్ సర్కార్ తీరును తప్పుబడుతూ ఆయన ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖలో 13 జిల్లాలు ఉన్న రాష్ట్రానికి 3 రాజధానులను నిర్మిస్తే భవిష్యత్‌లో ఎన్నో ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉందని పేర్కొన్నారు.

జగన్ సర్కార్ తీసుకున్న ఈ మూడు రాజధానుల నిర్ణయం వల్ల దేశ సమగ్రతకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆ లేఖలో తెలిపారు కనకమేడల. ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్  ఏర్పడిన తరువాత రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా  అమరావతి రాష్ట్ర రాజధానిగా ఖరారైందని లేఖలో ప్రధానికి రాసారు. అమరావతి శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా మీరే వచ్చారు అన్న విషయాన్ని ఈ లేఖలో నొక్కి చెప్పారు కనకమేడల.

సీఎం జగన్ తన పరిధిలో లేని అంశంపై జోక్యం చేసుకుంటున్నాడని, ఈ జోక్యం అనవసరం అని, కనకమేడల ప్రధానికి విన్నవించారు. ఇలాంటి కుట్రపూరితమైన  ప్రయాత్నాలు చేస్తున్న జగన్ సర్కారును అడ్డుకోవాలని ప్రధానిని కోరారు.

అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కూడా చూడాలని ఈ సందర్భంగా కనకమేడల ఆ లేఖలో ప్రధాని మోడీని కోరారు. ఇలా ప్రధానికి ఇలాంటి లేఖలు అందడం సర్వ సహజం. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఈ లేఖకు స్పందించడం ఇక్కడ విశేషం. ఈ లేఖ అందగానే ప్రధాని మోడీ స్పందిస్తూ లేఖ తమకు అందిందని, దాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు.

ఇప్పటివరకు మూడు రాజధానుల అంశంపై ఎక్కడా కూడా స్పందించని ప్రధాని మోడీ తొలిసారి ఇలా స్పందించడంతో మరోసారి మూడు రాజధానుల నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com