విశాఖలో హై అలర్ట్...

- March 20, 2020 , by Maagulf
విశాఖలో హై అలర్ట్...

విశాఖ:నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని విశాఖపట్నంలో తొలి పాజిటివ్ కేసు బయటపడడంతో ఏపీ వైద్యశాఖ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. నగరంలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన ఓ వృద్దుడికి వైరస్ సోకిందని తేలడంతో సిబ్బంది ఆయన నివాసం ఉన్న ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. మక్కా వెళ్లిన ఈ వృద్ధుడు వారం క్రితమే తిరిగి వచ్చాడు. మూడు రోజుల క్రితం జలుబు, దగ్గు, జ్వరంతో ఛాతి ఆసుపత్రిలో చేరాడు. ఆయనతోపాటు మరో ముగ్గురు కూడా అటువంటి లక్షణాలతోనే రావడంతో వీరి నుంచి వైద్య సిబ్బంది శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ లోని ల్యాబ్ కి పంపించారు.
నిన్న అక్కడి నుంచి నివేదిక రాగా వృద్దుడికి పాజిటివ్ అని తేలింది. దీంతో వృద్ధుడిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించడంతోపాటు అతను నివాసం ఉన్నప్రాంతంలో వైద్యబృందాలు సర్వే చేస్తున్నాయి. ఈ వృద్ధుడు ఈ వారం రోజులపాటు ఎవరెవరిని కలిశారు, ఎక్కడికి వెళ్లాడు తదితర అంశాలపై ఆరాతీస్తున్నారు. అదే సమయంలో వృద్దుడి నివాసిత ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యలు కూడా చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి తిరుపతిరావు మాట్లాడుతూ ఆశవర్కర్లు, వలంటీర్లతో కలిపి 114 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, మొత్తం 7,800 ఇళ్లను జల్లెడ పడుతున్నట్లు చెప్పారు. స్పేయింగ్ చేయడంతో పాటు వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తామని తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com