కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం తేవాలి--రాహుల్

- January 30, 2016 , by Maagulf
కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం తేవాలి--రాహుల్

దేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం తీసుకరావాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. హెచ్‌సీయూలో కొనసాగుతున్న ఉద్యమాన్ని అఖిల భారత స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని విద్యార్థి జేఏసీ నిర్ణయించింది. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ జన్మదినమైన 30వ తేదీ నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావించింది. రోహిత్ ఆత్మహత్యకు సంతాపంగా, సామాజిక న్యాయాన్ని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒక రోజు మహాదీక్ష నిర్వహించారు. ఈ దీక్షల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ శుక్రవారం అర్ధరాత్రి హెచ్ సీయూకు చేరుకున్నారు. అక్కడ జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం వరకు ఈ దీక్షలు కొనసాగాయి.అనంతరం ప్రొ. కంచె ఐలయ్య నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింప చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉద్ధేశించి రాహుల్ ప్రసంగించారు. తాను ఇక్కడకు ఎందుకు వచ్చారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారని, దేశంలో మరే విద్యార్థి ఇలాంటి వత్తిడితో ఆత్మహత్యకు పాల్పకూడదనే ఉద్ధేశ్యంతో తాను రావడం జరిగిందన్నారు. బీజేపీ తన భావజాలాన్ని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తోందని, యూనివర్సిటీల్లో వివక్ష ఉంటే దేశం ముందుకు సాగదని స్పష్టం చేశారు. గతంలో గాంధీకి జరిగిన అవమానం లాంటిదే రోహిత్ కు జరిగిందన్నారు. రోహిత్ ఒంటరి వాడు కాదని దేశంలో రోహిత్ లాంటి వ్యక్తులు చాలా మందే ఉన్నారని, రోహిత్ కు జరిగిన అవమానం దేశంలో ఇంకా ఎవరికైనా జరగవచ్చన్నారు. వివక్షకు వ్యతిరేకంగా చట్టం తీసుకరాకుంటే తాము పోరాటానికి వెనుకాడమని, ప్రజాస్వామ్యాన్ని భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని రాహుల్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com