దుబాయ్:దుబాయ్ చేరుకునే ప్రయాణికులకు మరోసారి కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది దుబాయ్. ఇక నుంచి విజిట్ వీసా, టూరిస్ట్ వీసాలపై దుబాయ్ చేరుకునే వాళ్లంతా ఖచ్చితంగా రిటర్న్ టికెట్ ను కూడా ముందే బుక్ చేసుకోవాలని సూచించింది. లేదంటే సదరు ప్రయాణికులను తీసుకువచ్చిన ఎయిర్ లైన్స్ వారే వారిని తీసుకువెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. దక్షిణాసియా దేశాలకు చెందిన కొంత ప్రయాణికులు ఎమిరేట్ లోకి ప్రవేశించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు లేకుండా దుబాయ్ విమానాశ్రయానికి చేరుకోవటంతో వాళ్లందర్ని విమానాశ్రయంలోనే నిలిపివేశారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి రిటర్న్ టికెట్ కూడా తప్పనిసరి అంటూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు ఎయిర్ పోర్టు అధికారులు. విమానాశ్రయంలో చిక్కుకుపోయిన వారిలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అప్ఘానిస్తాన్ కు చెందిన వారున్నారు. దాదాపు 200 మంది ఇండియన్లు ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయారని..వారిలో 140 నుంచి 150 మందిని తిరిగి స్వదేశానికి పంపించామని భారత దౌత్య కార్యాలయ అధికారులు తెలిపారు. అయితే..45 మంది ఎలాగోలా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకొని కింగ్డమ్ లోని తమ గమ్యస్థానాలకు చేరుకున్నారని వివరించారు.