రాజకీయాలు వద్దు నాన్నా...రజనీకి కూతుళ్ల విజ్ఞప్తి! మరి రజనీకాంత్ వింటారా..!?

- December 29, 2020 , by Maagulf
రాజకీయాలు వద్దు నాన్నా...రజనీకి కూతుళ్ల విజ్ఞప్తి! మరి రజనీకాంత్ వింటారా..!?

చెన్నై: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీపై సందిగ్ధత నెలకొంది. పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే పలుమార్లు వాయిదా వేస్తున్న రజనీ.. ఈ నెల 31న పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే చేతిలో ఉన్న అన్నాత్తే సినిమా కోసం ఆయన అహర్నిశలు పనిచేస్తున్నట్టు తెలిసింది. తొందరగా సినిమా ముగించి రాజకీయాలపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో రోజుకు 14 గంటలపాటు షూటింగ్‌లో పాల్గొనడంతో ఆయన శారీరక, మానసిక ఒత్తిడికి లోనయ్యారు. దాంతో అన్నాత్తే షూటింగ్‌ కోసం ఈ నెల 13న హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఐదు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు.

శరీరంలో బీపీ లెవల్స్‌ హెచ్చుతగ్గులు కావడంతో జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడ్డాక చెన్నై పయనమయ్యారు. ఈనేపథ్యంలో రాజకీయాలు తమ జీవితంలోకి వచ్చిన తర్వాతే మానసిక ఒత్తిళ్లు పెరిగిపోయాయని రజనీ కూతుళ్లు ఆయన వద్ద వాపోయారని తెలిసింది. రాజకీయాలకు దూరంగా ఉండాలని తండ్రిని కూతుళ్లిద్దరూ కోరినట్టు సమాచారం. మరి రజనీతో కలిసి నడుస్తామని గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులు, రాజకీయ మిత్రుల్లో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది.

వారం రోజుల విశ్రాంతిలో రజనీ
కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స, తీవ్ర స్థాయిలో బీపీ, వృద్ధాప్య కారణాల రీత్యా వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడికి గురయ్యే పనులను దూరంగా ఉండాలని, కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. దీంతో అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్న రజనీ చెన్నైలోని పోయెస్‌ గార్డెన్‌లోని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈక్రమంలో పార్టీ ప్రకటన సాధ్యం కాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, రజనీ మక్కల్‌ మన్రం నిర్వాహకులు మాత్రం పార్టీ ప్రకటనే ఖాయమే ధీమాతో ఉన్నారు. పార్టీతోపాటు మరిన్ని ప్రకటనలు చేయడం ఖాయమని మన్రం కో పర్యవేక్షకుడు తమిళరవి మణియన్‌ అన్నారు. 234 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టడం ఖాయమని తెలిపారు.

రజనీ రాజకీయాల్లోకి రారు– కేఎస్‌ అళగిరి 
ఆధ్యాత్మిక భావాలు కలిగిన రజనీకాంత్‌  రాజకీయాల్లోకి రారని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాప దినోత్సవాన్ని చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో సోమవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..  ‘రజనీ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతోంది. రాజకీయాల్లోకి వచ్చి పార్టీ గెలిచినా ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇష్టం లేదని అన్నారు. సీఎం కారని స్పష్టమైనప్పుడు ఎందుకు ఓటేయాలని ప్రజలు, అభిమానులు భావిస్తా’రని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com