యువకుడిని మోసం చేసిన దంపతులు...అరెస్ట్ చేసిన రాచకొండ పోలీస్
- January 02, 2021
హైదరాబాద్: ఓ వెబ్సైట్లో నకిలీ ప్రొఫైల్ పెట్టి యువకుడిని మోసం చేసిన దంపతులు ఏకంగా రూ.21లక్షలు దోచుకున్నారు. యువకుడు అందించిన ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అ దంపతులను అరెస్టుచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన కంపా హృదయానంద్ అనే యువకుడు 2017లో అనూష అలియాస్ హారిక అనే యువతిని పెండ్లి చేసుకున్నారు. అనంతరం హృదయానంద్ అనారోగ్యం పాలవడంతో ఏ పనీ చేయలేకపోవడంతో హారిక హైదరాబాద్లోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్లో పనిచేస్తుంది. చాలీచాలని సంపాదనతో సంతృప్తి చెందక ఆన్లైన్ మోసాలకు పథకం వేశారు. హారికా హృదయానంద్ అనే పేరుతో ఓ ఫేక్ ప్రొఫైల్ తయారుచేసి గుర్తుతెలియని అందమైన యువతి ఫొటోతో ఇండియన్ డేటింగ్.కామ్ అనే వెబ్సైట్లో పోస్టుచేశారు. నేరెడ్మెట్కు చెందిన డోనాల్డ్ హోరసీస్ రోజారియో అనే వ్యక్తి చాటింగ్ మొదలెట్టాడు. హృదయానంద్ తాను యువతిలా చాటింగ్ చేయడం ప్రారంభించాడు. చివరకు గుండె జబ్బుతో బాధపడుతున్న తన తల్లి ఆపరేషన్ కోసం డబ్బు కావాలని కోరింది. అతను ఆన్లైన్లో డబ్బు పంపాడు. మరికొన్ని రోజుల తర్వాత తల్లి మరణించిందని, తన సోదరి సర్జరీ చేయించాలని పలుమార్లు డబ్బు అడిగింది. ఇలా పలు దఫాలుగా డోనాల్డ్ రూ.21లక్షలు ఆమెకు ఆన్లైన్లో పంపాడు. ఆ తర్వాత కూడా పెళ్లిని వాయిదా వేస్తూ రావడంతో అనుమానించిన డోనాల్డ్ రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విజయవాడకు వెళ్లి నిందితులను పట్టి తెచ్చారు. శుక్రవారం ఇద్దరిని రిమాండుకు తరలించారు. పెళ్లి విషయంలో ఆన్లైన్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సైబర్క్రైమ్ ఏసీపీ హరినాథ్ నెటిజన్లకు సూచించారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









