యువతే భారత్ ఆత్మ:టి.గవర్నర్

- January 12, 2021 , by Maagulf
యువతే భారత్ ఆత్మ:టి.గవర్నర్
స్వామి వివేకానంద ఒక నిరంతర స్ఫూర్తి 
ఆత్మనిర్భర్ భారత్ లో యువత కీలకం 
స్వామి వివేకానందుని బోధనల స్ఫూర్తితోనే గవర్నర్ గా ఎదిగాను. 
హైదరాబాద్:యువతలోనే భారతీయ ఆత్మ ఉందని గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతదేశ అభివృద్ధిలో, ఆత్మ నిర్భర్ భారత్ ఆవిష్కరణలో యువతదే అత్యంత కీలకపాత్ర అని గవర్నర్ అన్నారు. 
 
భారత్ ను విశ్వ గురువుగా నిలపాలన్న స్వామి వివేకానంద పిలుపును, భారత్ ను స్వయం-ఆధారిత ఆత్మనిర్భర్ భారత్ గా నిలపాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పాన్ని సాధించాలంటే యువత కీలక భూమిక పోషించాలని డా. తమిళిసై పిలుపునిచ్చారు. 
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువోత్సవ్-2021 ను ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా సంస్థ 21వ జాతీయ స్టూడెంట్ కంపెనీ సెక్రటరీస్ సదస్సును ఈరోజు నిర్వహించింది. 
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. 
“నేను బాల్యంలో పాఠశాలలో చదువుతున్నప్పుడు నాకు నా తండ్రి స్వామి వివేకానందుని పుస్తకాన్ని బహుకరించాడు. అప్పటి నుండి దాదాపు ప్రతిరోజూ స్వామీజీ బోధనలు చదువుతున్నాను. అవి నాలో నిరంతరం స్ఫూర్తి నింపుతాయి. కొందరు యువకులు చిన్న చిన్న కారణాలతో ఆత్మ హత్యకు పాల్పడటం నన్ను కలచివేస్తుంది. వారు గనుక స్వామి వివేకానందుని స్ఫూర్తదాయక రచనలు చదివి ఉంటే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకునేవారు కాదు” అని గవర్నర్ స్పష్టం చేశారు.సినిమా హీరోలకు పాలాభిషేకం యువత చేయడం చూస్తుంటాం. కానీ సమస్తమైన శక్తి తమలోనే ఉందని యువత తెలుసుకోవాలి. ప్రతీ యువత వారికి వారే నిజమైన హీరోలుగా భావించి గొప్ప పనులు చేయాలి. 
 
నేను ఈరోజు గవర్నర్ గా ఎదిగానంటే అందుకు ప్రధాన కారణం స్వామి వివేకానందుని బోధనలు నాలో స్ఫూర్తి నింపడమేనని డా. తమిళిసై వివరించారు.ప్రపంచంలో యువజనులను ఎక్కువగా కలిగి ఉన్నది భారతదేశమని, ఇది భారత్ సమగ్ర అభివృద్ధికి అత్యంత అనుకూల అంశమన్నారు. గొప్ప పనులు సాధించాలంటే, గొప్ప త్యాగాలతోనే సాధ్యమని, చిత్తశుద్ధితో, నిజాయితీతో కూడిన సంకల్పంతో, కార్యదీక్షతో తమ లక్ష్యాలను సాధించాలని, భారత్ ఔన్నత్యాన్ని మరింత పెంచాలని గవర్నర్ యువతకు పిలుపునిచ్చారు. 
ఈ కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ధూ యూనివర్సిటీ ఇంఛార్జి విసి ప్రొ. ఎస్.ఎమ్. రహమతుల్లా, ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావులు గౌరవ అతిధులుగా పాల్గొన్నారు. ఐ సి ఎస్ ఐ అధ్యక్షులు ఆశిష్ గర్గ్, సి ఎస్ కన్నన్, పాల్వాయి విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com