సౌదీలో చిక్కుకున్న తెలంగాణ వాసి...విడిపించండంటూ భార్య అభ్యర్ధన

- March 07, 2021 , by Maagulf
సౌదీలో చిక్కుకున్న తెలంగాణ వాసి...విడిపించండంటూ భార్య అభ్యర్ధన

హైదరాబాద్: సౌదీ అరేబియాలో యజమాని చేతిలో మోసపోయిన తన భర్త చిక్కుకున్నాడని హైదరాబాద్‌కు చెందిన నఫీస్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను క్షేమంగా ఇండియాకు రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. నఫీస్ బేగం భర్త హసన్ పాషా కొన్నేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఓ పెయింటింగ్ షాప్‌లో పనికి కుదిరారు. 10ఏళ్లపాటు అందులోనే పని చేసిన హసన్ పాషాకు.. యజమాని షాపులో భాగస్వామ్యం ఇచ్చాడు. భాగస్వామ్యం తీసుకున్నందుకుగానూ హసన్ పాషా నుంచి సదరు యజమాని నెలకు దాదాపు 4వేల రియాళ్ళు వసూలు చేశారు. అనంతరం అతని యజమాని ఆ షాపును హసన్‌ పాషాకే లీజుకిచ్చి.. నెలకు 5,500 రియాళ్లను అద్దెగా చెల్లించాల్సిందిగా కోరాడు. దీనికి హసన్ పాషా కూడా అంగీకరించాడు. 

మూడు నెలలపాటు హసన్ పాషా సవ్యంగానే అద్దె చెల్లించాడు.ఈ క్రమంలోనే కరోనా పంజా విసిరింది. అనంతరం ఆ షాపును మున్సిపల్ అధికారులు కూల్చేశారు. ఈ క్రమంలో స్పందించిన యజమాని.. భారత్ కు వెళ్లి, కొత్త వీసాపై తిరిగి రావాల్సిందిగా హసన్ పాషాకు సూచించాడు. దానికి హసన్ పాషా అంగీకరించాడు. దీంతో వీసా కోసమని నమ్మబలికి అతని యజమాని హసన్ పాషా వద్ద కొన్ని సంతకాలు తీసుకున్నాడు. అనంతరం స్వదేశానికి బయల్దేరిన హసన్ పాషాకు ఓ షాకింగ్ విషయం తెలిసింది.15,000 సౌదీ రియాళ్లను మోసం చేసినట్టుగా తన యజమాని తనపై ఫిర్యాదు చేశాడని.. దేశం విడిచి వెళ్లకుండా అతని పేరును అధికారులు బ్లాక్ లిస్ట్‌లో చేర్చినట్టు తెలుసుకుని హసన్ పాషా షాకయ్యాడు.ఈ క్రమంలో హసన్ పాషా సౌదీ అరేబియాలో చిక్కుకున్నాడు.హసన్ పాషా తల్లి సర్వరున్నిసా మాట్లాడుతూ, తాను ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నానని, వైద్య చికిత్స పొందటానికి డబ్బు లేదని అన్నారు.
కాగా.. తన కొడుకుకు సహాయం చేసి, స్వదేశానికి రప్పించాల్సిందిగా తల్లి,భార్య,విదేశాంగ మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com