గల్ఫ్ కార్మికుల కనీస వేతనాల తగ్గింపుపై హైకోర్టులో 'పిల్'

- March 26, 2021 , by Maagulf
గల్ఫ్ కార్మికుల కనీస వేతనాల తగ్గింపుపై హైకోర్టులో \'పిల్\'

హైదరాబాద్:భారత ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు 30 నుండి 50 శాతం కనీస వేతనాలు (మినిమం రిఫరల్ వేజెస్) తగ్గిస్తూ గత సంవత్సరం సెప్టెంబర్ లో జారీ చేసిన రెండు సర్కులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కోరుతూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. 

హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిల ధర్మాసనం కేసును గురువారం (25.03.2021) నాడు విచారణకు స్వీకరించారు.పిటిషనర్ తరఫున న్యాయవాది బి.రచనారెడ్డి కేసు వాదించారు. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విదేశాంగ కార్యదర్శి, హైదరాబాద్ లోని విదేశాంగ శాఖ ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. కేసు తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం 29 జులై కి వాయిదా వేశారు.ఇలాంటి మరొక కేసును కలిపి విచారించనున్నట్లు తెలిపారు.
 
ఈ సందర్బంగా మంద భీంరెడ్డి మాట్లాడుతూ తగ్గించిన కనీస వేతనాల వలన గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 88 లక్షల మంది భారతీయుల ఆదాయంపై భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావం పడుతుందని, వారు మరింత పేదరికంలోకి జారిపోనున్నారని అన్నారు.గత మూడు నెలలుగా గల్ఫ్ కార్మిక సంఘాలు పాత వేతనాలను కొనసాగించాలని, కనీస వేతనాలను తగ్గిస్తూ జారీచేసిన సర్కులర్లను రద్దు చేయాలని ఉద్యమాలు చేస్తున్నారని ఆయన అన్నారు.ఇటీవల గల్ఫ్ జెఏసి ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్లి ఎంపీలు,కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించారని,కేంద్రం ఈ విషయాన్ని మానవతా దృక్పధంతో ఆలోచించాలని అన్నారు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com