కేరళలో షూటింగ్ జరుపుకోనున్న 'దృశ్యం -2'

- March 30, 2021 , by Maagulf
కేరళలో షూటింగ్ జరుపుకోనున్న \'దృశ్యం -2\'

కేరళ:విక్టరీ వెంకటేశ్ మామూలు గానే హ్యాపీగా ఉంటాడు. ఆధ్యాత్మికతకు, యోగాకు తన  జీవితంలో తగిన ప్రాధాన్యమివ్వడమే దానికి కారణమని వెంకటేశ్ చెబుతుంటాడు. ఆయనతో ఓ ఐదు నిమిషాలు మాట్లాడితే... మనసుకు హాయిగా ఉంటుందని, బాదరబందీలను మర్చిపోతామని తోటి నటీనటులు చెబుతుంటారు. అయితే ఇప్పుడు వెంకటేశ్ మరింత ఆనందంగా ఉన్నాడట. ఎందుకున్నాడంటే... ఆయన నటిస్తున్న 'నారప్ప'కు మాతృక అయిన 'అసురన్'కు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. దాంతో సహజంగానే ఇక్కడ దాని రీమేక్ 'నారప్ప'కు క్రేజ్ పెరిగిపోయింది. ధనుష్ మరోసారి ఉత్తమ నటుడిగా 'అసురన్' చిత్రంలోని నటనకు గానూ ఎంపికయ్యాడు. అలానే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానూ 'అసురన్' అవార్డ్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం 'ఎఫ్ 2' సీక్వెల్ 'ఎఫ్ 3'తో పాటు వెంకటేశ్.. 'దృశ్యం' సీక్వెల్ లోనూ నటిస్తున్నాడు.

అంటే అతను చేస్తున్న రెండు సీక్వెల్స్ బ్యాక్ టు బ్యాక్ జనం ముందుకు రాబోతున్నాయన్నమాట.మార్చి 1న 'దృశ్యం' సీక్వెల్ పట్టాలెక్కింది.హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఇప్పుడు మిగిలిన భాగం షూటింగ్ కోసం కేరళ వెళ్ళింది. అక్కడ జరిగే షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్తయిపోతుంది. 'దృశ్యం' తొలి భాగంలో నటించిన నటీనటులే దాదాపు ఈ సీక్వెల్ లోనూ అవే పాత్రలు చేస్తున్నారు. అయితే... 'దృశ్యం' తెలుగు రీమేక్ కు నటి శ్రీప్రియ దర్శకత్వం వహించగా, ఇప్పుడు సీక్వెల్ ను మాత్రం మలయాళ దర్శకుడు జీతూ జోసఫే తెలుగులో తీస్తున్నారు. వేసవి చివరిలో 'దృశ్యం -2' రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ థియేటర్స్, ఆశీర్వాద్ సినిమాస్ తో కలిసి సురేశ్ బాబు నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com