ఈ నెల విడుదల కానున్న 'రేడియో మాధవ్'

- April 05, 2021 , by Maagulf
ఈ నెల విడుదల కానున్న \'రేడియో మాధవ్\'

చెన్నై:విజయ్ సేతుపతి, జయరామ్‌ హీరోలుగా నటించిన మలయాళ సినిమా ‘మార్కోని మతాయ్‌’. గుండేపూడి శ్రీను సమర్పణలో డి.వి. కృష్ణస్వామి ఈ చిత్రాన్ని ‘రేడియో మాధవ్‌’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి జంటగా నటించిన మలయాళ చిత్రాన్ని తెలుగులో 'హేయ్ పిల్లగాడ' పేరుతో డి. వి. కృష్ణస్వామి విడుదల చేశారు. ‘బిచ్చగాడు’తో పాటు పలు అనువాద చిత్రాలకు చక్కని మాటలు, పాటలు అందించిన భాషాశ్రీ ఈ సినిమాకు మాటలు, పాటలు రాశారు. 
''ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో తెలియదు. సినిమాలో జయరామ్‌ ప్రేమలో పడతారు. ఏజ్‌ ఫ్యాక్టర్‌ వల్ల ప్రేమలో దూరం పెరుగుతుంది. విజయ్‌ సేతుపతి ప్రేమికులను ఎలా కలిపారన్నది కథ. మలయాళంలో మంచి విజయం సాధించింది. డబ్బింగ్‌ సినిమా అనేలా ఉండకూడదని పలు జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రేక్షకులకు స్ట్రయిట్‌ సినిమా చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఈ నెల 23న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అని నిర్మాత డి. వి. కృష్ణస్వామి తెలిపారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ తో కలిసి జయరామ్ నటించిన 'తెనాలి, పంచతంత్రం' చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి. అలానే స్ట్రయిట్ తెలుగు సినిమాలు 'భాగమతి, అల వైకుంఠపురములో' చిత్రాలలో జయరామ్ నటించారు. ఇప్పుడు తన మలయాళ చిత్రం 'మార్కోని మతాయ్' తెలుగులో 'రేడియో మాధవ్'గా డబ్ కావడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. 'ఉప్పెన' చిత్రంలో ప్రేమికులను విడగొట్టిన పాత్ర చేసిన విజయ్ సేతుపతి ఇందులో ప్రేమికులను కలిపే పాత్రను చేశారని రచయిత భాషాశ్రీ తెలిపారు. ఆత్మీయ రాజన్, పూర్ణ, నరేన్, అజూ వర్గీస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com