విడిపోతున్నామంటూ ప్రకటించి షాకిచ్చిన బిల్ గేట్స్ దంపతులు
- May 04, 2021
ఇటీవలే ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సైతం తన భార్య మాకెంజీ స్కాట్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో మరో ప్రపంచ కుబేరుడు సైతం నడించేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచ కుబేరులలో ఒకరు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్మెలిందాగేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్గేట్స్(65), ఆయన సతీమణి మిలిందా గేట్స్(56) సంచలన ప్రకటన చేశారు. 27 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తామిద్దరం విడాకులు తీసుకోబోతున్నట్టు ఈ జంట ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా సోమవారం అర్థరాత్రి దాటాక ప్రకటించి షాక్ ఇచ్చారు. గత 27 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు పొందిన ఈ జంట.. ఇకపై దంపతులుగా కలిసి ఉండలేమని భావిస్తున్నట్లు తెలిపారు.
జీవితంలో ఇక భార్యాభర్తలుగా కలిసి ఉండలేమని ఇరువురు సంయుక్త ప్రకటన చేశారు. అయితే, తమ బిల్-మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛంద కార్యక్రమాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. "ఎన్నో సమాలోచనలు, ఎంతో ఆవేదన తర్వాత 27 ఏళ్ల మా వైవాహిక బంధానికి ముగింపు పలకాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేశాం. ప్రపంచంలోని ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, మెరుగైన జీవనం కల్పించే ఫౌండేషన్ను స్థాపించాం. ఈ ఫౌండేషన్ కోసం మేము కలిసే పనిచేస్తాం. కానీ, జీవితంలోని తర్వాతి దశల్లో మేము దంపతులుగా కొనసాగలేమని భావిస్తున్నాం." అని తమ సంయుక్త ప్రకటనలో బిల్గేట్స్ దంపతులు వెల్లడించారు.
ఇక ప్రస్తుతం బిల్గేట్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. గత ఫిబ్రవరి నాటికి ఆయన ఆస్తి విలువ సుమారు 137 బిలియన్ డాలర్లు. ఇక 2000లో స్థాపించిన బిల్-మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకూ 53 బిలియన్ డాలర్లను వివిధ స్వచ్ఛంద కార్యాక్రమాలకు వినియోగించారు. ప్రస్తుతం బిల్గేట్స్ వయసు 65 కాగా.. మెలిందా వయసు 56 ఏళ్లు. 1994లో వివాహబంధంతో ఒక్కటైన బిల్ గేట్స్ దంపతులు 27 ఏళ్ల తర్వాత విడిపోతుండడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ను స్థాపించి బిల్గేట్స్ సీఈవోగా ఉన్న సమయంలో మిలిందా ప్రొడక్ట్ మేనేజర్గా చేరారు. అప్పట్లో కంపెనీలో చేరిన ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో ఏకైక మహిళ మెలిందాయే కావడం విశేషం.
తాజా వార్తలు
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..
- CBSE–JEE విధానం విద్యార్థుల్లో ఆలోచనా వైవిధ్యాన్ని తగ్గిస్తోంది: బిట్స్ వీసీ రామగోపాల్ రావు
- విశాఖలో బ్రిక్స్ క్రీడా మంత్రుల భేటీ.. భారత్ కీలక ప్రతిపాదనలు
- వాహనాలపై ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోతే చర్యలు తప్పవు: దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అబుదాబిలో డిసెంబర్ 3 నుంచి ఫార్ములా-1 గ్రాండ్ ప్రిక్స్
- కొలరాడోలో NATS చెస్ టోర్నమెంట్ చక్కటి స్పందన
- ముష్రిఫ్ నేషనల్ పార్క్లో కొత్త బ్రిడ్జి ప్రారంభం..
- బహ్రెయిన్లో లోజ్ పండ్ల ధరలకు రెక్కలు..!!







