భారత్ లో 'స్మార్ట్' గా నడుస్తున్నశామ్‌సంగ్‌

- June 03, 2015 , by Maagulf
భారత్ లో 'స్మార్ట్' గా నడుస్తున్నశామ్‌సంగ్‌

మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌లో సంచలనాలకు మారుపేరు ఐఫోన్‌. ఆ ఫోన్‌కు రూపకల్పన చేసిన ఆపిల్‌కు శామ్‌సంగ్‌కూ చాలా పెద్ద పోటీ నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా భారత్‌ మార్కెట్‌ అధ్యయనంలో ఆపిల్‌ మార్కెట్‌ కంటె శామ్‌సంగ్‌కే మార్కెట్‌ ఎక్కువ ఉన్నట్టు తేలింది. రూ30వేల పైబడిన ఖరీదు గల ఫోన్‌లలో ఎక్కువ అమ్ముడుపోతున్నవి శామ్‌సంగ్‌ ఫోన్‌లేనట! శామ్‌సంగ్‌ ఉత్పత్తులైన గ్యాలక్సీ ఎస్‌6, ఎస్‌6 ఎడ్జ్‌ వంటి ఆధునిక పోన్‌ మోడల్స్‌కు వినియోగదారులలో మంచి క్రేజ్‌ ఏర్పడడంతో ఈ సంవత్సరం జనవరినుంచి ఏప్రిల్‌ మధ్యకాలంలో మార్కెట్‌లో దాదాపు 46 శాతం విక్రయాలు శామ్‌సంగ్‌ ఖాతాలోనే చేరాయి. ఆపిల్‌ ఉత్పత్తులు మాత్రం ఇదే కాలంలో 42 శాతం మాత్రమే విక్రయాలు నమోదు చేశాయి. ఆపిల్‌ కంపెనీ భారత్‌ మార్కెట్‌పై దృష్టిపెట్టినప్పటినుంచి రూ.30 వేలు పైబడిన రేట్లు గల స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో దాదాపు 50 శాతాన్ని అందిపుచ్చుకుని ముందుకుదూసుకుపోయింది. క్రిందటి సంవత్సరం జూలై నుంచి డిసెంబర్‌ వరకు ఐఫోన్‌6, 6 ప్లస్‌ మోడల్స్‌ వినియోగదారులను బాగా ఆకట్టుకున్నాయి. ఇదే సమయంలో శామ్‌సంగ్‌ మార్కెట్‌ 25నుంచి 30 శాతం మాత్రమే ఉంది. అయితే 2015లో ఇండియాలో శామ్‌సంగ్‌ దశ తిరిగింది కొత్త కొత్త మోడల్స్‌తో శామ్‌సంగ్‌ రంగంలోకి రావడంతో వినియోగదారుల చూపు అటుమళ్లింది. భారతదేశంలో మార్కెట్‌ అవకాశాలను మరింతగా పుంజుకునేటట్టు చేయాలన్నది ఆపిల్‌ వ్యూహం. అయితే ఆపిల్‌ రూపొందించిన కొన్ని మార్గదర్శక సూత్రాలే భారత్‌లో ఆపిల్‌ మార్కెట్‌ వ్యూహాలకు ప్రతిబంధకంగా మారడంతో వాటిని నెమ్మదిగా సడలించడానికి ఆపిల్‌ సిద్ధపడుతున్నది. త్వరలో క్యాష్‌బ్యాక్‌ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని ఆపిల్‌ యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com