పరాయి దేశంలో వలస మహిళ ఆక్రందన..

- June 03, 2015 , by Maagulf
పరాయి దేశంలో వలస మహిళ ఆక్రందన..

ఉపాధి కోసం గల్ఫ్ వెళ్ళిన ఒక మహిళ అక్కడ కష్టాలపాలయింది. తిరిగి ఇండియాకు రావడానికి సరైన ధ్రువపత్రాలు లేక ఇబ్బందులు పడుతోంది. అధికారులు తన కష్టాన్ని అర్ధం చేసుకొని తాను ఇండియాకు వచ్చే ఏర్పాట్లు చేయాలని ఆమె వేడుకుంటోంది. ఈ వైనంపై గల్ఫ్ లోని 'టైమ్స్ ఆఫ్ ఒమాన్' అనే పత్రిక కధనం ప్రచురించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

 

కాళ్ళ మండలం కోనలపల్లె గ్రామానికి చెందిన ఉల్లూరి బేబిరాణి గల్ఫ్ లోని ఒమాన్ దేశానికి సుమారు అయిదేళ్ళ క్రితం ఉపాధి నిమిత్తం వెళ్ళింది. అక్కడ ఒక ఇంట్లో హౌస్ కీపింగ్ పనులు నిర్వహిస్తోంది. తమిళనాడుకు చెందిన శక్తిదాసన్ కూడా ఉప్పది నిమిత్తం గల్ఫ్ వెళ్ళాడు. అక్కడ బేబిరాణికి శక్తిదాసన్ తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహానికి చట్టబద్ధత లేదు. తదనంతరం వీరిద్దరూ పిల్లలకు జన్మనిచ్చారు. వీరికి వివాహ ధ్రువపత్రాలు లేకపోవడంతో పురుడు సమయంలో ఆస్పత్రికి వెళ్లలేకపోయారు. ఇద్దరు పిల్లలు సాధారణ ప్రసవం ద్వారానే జన్మించారు. అందులో మొదటి బిడ్డ వికలాంగుడు. బేబిరాణి వయసు 28 సంవత్సరాలు కాగా ఇద్దరు పిల్లల వయసు 2, 4 సంవత్సరాలు. ప్రస్తుతం ఆమె పూర్తిగా అనారోగ్యం పాలై మంచాన పడింది. ఆమె భర్త..పిల్లలను, ఆమెను పోషించడం కష్టంగా మారింది. ఆమె అనారోగ్యానికి డబ్బులు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతున్నాయి. ఆమెను ఇండియా తీసుకొద్దామంటే పాస్ పోర్టు ఎక్కడో పోయింది. దీంతో ఆమె భర్త భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. అయితే ఆమె భారతీయురాలనే ధృవపత్రం ఉంటేనే ఆమెనూ, పిల్లలనూ ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేస్తామని అక్కడి అధికారులు తెలిపారు. శక్తిదాసన్ కు పాస్పోర్టు ఉన్నా బేబిరాణి పాస్పోర్టు లేకపోవడంతో అందరూ అక్కడే ఉండిపోవలసి వచ్చింది. అయితే తన భార్యనూ, పిల్లలనూ ఇండియాకు తీసుకెళ్ళి పోషించుకుంటానని తన భార్య ఇండియాకు వెళ్ళాలంటే ఇండియన్ నేటివిటి సర్టిఫికేట్ కావలసి ఉందని అధికారులు తాము ఇండియాకు వచ్చేలా సహాయం చేయాలని శక్తిదాసన్ కోరుతున్నాడు. తన భార్య తల్లిదంద్రులతోపాటు ఉన్న రేషన్ కార్డు జిరాక్స్ కాపీ ఉందని, దాని ఆధారంగా తనకు స్థానిక అధికారులు నేటివిటి పంపిస్తే భారత రాయబార కార్యాలయ అధికారులు తమను ఇండియాకు పంపించే అవకాశం ఉందని శక్తిదాసన్ వేడుకుంటున్నాడు.

 

నేటివిటి సర్టిఫికేట్ ఇస్తాం: వి. జితేంద్ర తహసిల్దార్

ఈ విషయాన్ని తహసిల్దార్ వి.జితేంద్ర దృష్టికి తీసుకెళ్లగా గల్ఫ్ దేశం ఒమాన్ లో అనారోగ్యం పాలైన బేబిరాణి ఈ దేశానికి రావడానికి అన్ని విధాలా సహకరిస్తామని, తగిన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేస్తే నేటివిటి సర్టిఫికేట్ అందజేస్తామని, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళతామని చెప్పారు.

 

                                                                                --- వనంబత్తిన రాజ్ కుమార్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com