తెలంగాణ:కేబినెట్‌ కీలక నిర్ణయాలు..!

- August 01, 2021 , by Maagulf
తెలంగాణ:కేబినెట్‌ కీలక నిర్ణయాలు..!

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్‌ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.. ముఖ్యంగా వ్యవసాయంపై విస్తృత చర్చ జరిగింది.. వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర వ్యవసాయ అంశాలపై కేబినెట్‌ చర్చించింది.. పత్తిసాగుపై మంత్రి మండలి ప్రత్యేకంగా చర్చించింది. తెలంగాణ పత్తికి ఉన్న ప్రత్యేక డిమాండ్‌ వల్ల సాగు మరింత పెంచాలని, అందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపరచాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించింది. అటు రుణమాఫీ అంశం కూడా చర్చకు వచ్చింది.. రాష్ట్రంలో ఇప్పటి వరకు పంట రుణ మాఫీకి సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ కేబినెట్‌ ముందుంచింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడటం వల్ల గత రెండేళ్లుగా పాతికవేల వరకు వున్న రుణాలను మాత్రమే మాఫీ చేశారు.. ఈ నేపథ్యంలో ఈనెల 15 నుంచి నెలాఖరు నాటికి 50వేల వరకు వున్న పంట రుణాల మాఫీని పూర్తిచేయాలని కేబినెట్‌ ఆదేశించింది.. దీని ద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.

ఇక కొత్తగా ఏర్పాటు చేయబోయే ఐదు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులపైనా కేబినెట్‌ చర్చించింది. తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై చర్చించారు. త్వరలోనే వీటి నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని కేబినెట్‌ అధికారులను ఆదేశించింది. వరంగల్‌, చెస్ట్‌ ఆస్పత్రి ప్రాంగణం, టిమ్స్‌, గడ్డి అన్నారం, అల్వాల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది.. అటు పటాన్‌చెరులో కార్మికులు, ఇతర ప్రజల ప్రయోజనాల కోసం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేసింది..అలాగే అన్ని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఇకపై టిమ్స్‌గా నామకరణం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.. అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను ఒక్కచోటనే అందించేందుకు సమీకృత వైద్య కళాశాలలుగా తీర్చిదిద్ది సత్వరమే వైద్యసేవలు ప్రారంభించాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com