ఐపీఎల్ అభిమానులకు శుభవార్త

- August 19, 2021 , by Maagulf
ఐపీఎల్ అభిమానులకు శుభవార్త

యూఏఈ: కరోనా కారణంగా ఐపీఎల్ 2021 మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ఐపీఎల్ 2021 సెకండ్ ఎడిషన్ త్వరలోనే ప్రారంభం కానుంది.యూఏఈలో మిగిలిన మ్యాచ్‌లను పూర్తి చేయడానికి బీసీసీఐ సిద్ధమైంది.ఈ మేరకు సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో మిగిలిన 31 మ్యాచ్‌లు జరుగుతాయి.

ఈ క్రమంలో ఐపీఎల్‌ అభిమానులకు బీసీసీఐ,ఈసీబీ రెండు శుభవార్తలు చెప్పాయి. వచ్చే నెల 19 నుంచి యూఏఈలో జరగబోతున్న ఐపీఎల్ సెకండ్ షెడ్యూల్‌లో మైదానాలకు ప్రేక్షకులను అనుమతించబోతున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దీనికి యూఏఈ ప్రభుత్వం కూడా పచ్చ జెండా ఊపింది. అలాగే వచ్చే ఏడాది.. అంటే 2022 ఐపీఎల్‌లో ప్రేక్షకులకు మరింత మజా పెంచేందుకు 8 జట్లకు బదులు 10 జట్లతో టోర్నీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

అయితే.. ఐపీఎల్ యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ భావించిన సమయంలోనే స్టేడియాలకు ప్రేక్షకులను అనుమతిస్తారా..? లేదా అనే విషయంపై పెద్ద చర్చ నడిచింది. దానిపై అప్పట్లో బీసీసీఐ కానీ, యూఏఈ ప్రభుత్వం కానీ స్పందించ లేదు. యూఏఈ క్రికెట్ బోర్డు జనరల్ సెక్రెటరీ ముబాషిర్ ఉస్మాన్.. అటు యూఏఈ ప్రభుత్వంతోనూ, ఇటు బీసీసీఐతోనూ మాట్లాడతామని అప్పట్లో ప్రకటించారు. ఇక తాజాగా ఈ చర్చలు ఫలించడంతో.. 60శాతం ప్రేక్షకులను అనుమతించుకునేందుకు యూఏఈ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఐపీఎల్ గురించి కూడా అభిమానులకు బీసీసీఐ కిక్ ఇచ్చే న్యూస్ అందించింది. వచ్చే ఏడాది టోర్నీ ప్రేక్షకులకు మరింత మజా పంచనుందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ చెప్పారు. ఎప్పటిలా 8 జట్లతో కాకుండా.. ఈ సారి 10 జట్లతో టోర్నీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే ఏ జట్లు కొత్తగా చేరబోతున్నాయనేది మాత్రం సస్పెన్స్‌.

ఇకపోతే, మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకునే ప్రేక్షకులు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకుని ఉండాలని నిబంధన పెట్టారు.రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న అభిమానులు సర్టిఫికెట్ చూపితేనే గ్రౌండ్ లోకి వెళ్లనిస్తారు. ఐపీఎల్ 2021 సెకండ్ ఎడిషన్ లో 31 మ్యాచ్‌లు జరగనున్నాయి.ఈ మ్యాచ్‌లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(దుబాయ్),జాయేద్ క్రికెట్ స్టేడియం,(అబుధాబి),షార్జా క్రికెట్ స్టేడియం(షార్జా)లో జరుగుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com