కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- April 02, 2026
కేరళ: గాన గంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కీర్తికి మరో గొప్ప గౌరవం దక్కింది. సంగీతానికి భాషా పరిమితులు లేవని నిరూపిస్తూ కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్లో ఆయన భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వీటీ భట్ట తిరిప్పాడ్ కల్చరల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని కుటుంబ సభ్యులు, సంగీత ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గాయకులు మనో, చిత్ర, హరిహరన్, సుజాత మోహన్, విజయ్ ఏసుదాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అక్కడి వాతావరణాన్ని మరింత భావోద్వేగభరితంగా మార్చింది.
సంగీత మేఘం కార్యక్రమంతో నివాళి
విగ్రహావిష్కరణ సందర్భంగా ‘సంగీత మేఘం’ పేరిట ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు ప్రముఖ గాయకులు తమ గానంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి స్వర నివాళి అర్పించారు. ఆయన పాడిన అమర గీతాలను ఆలపిస్తూ సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి ఉన్ని కణయ్ అత్యంత అందంగా రూపొందించారు. విగ్రహం రూపకల్పనలో ఎస్పీబీ యొక్క వ్యక్తిత్వం, సంగీతంపై ఆయనకున్న మక్కువను ప్రతిబింబించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గతంలో హైదరాబాద్లో ఎస్పీబీ విగ్రహం ఏర్పాటు విషయంలో కొన్ని వివాదాలు చోటుచేసుకున్నాయి.అయితే కేరళలో మాత్రం ఎలాంటి వివాదాలు లేకుండా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం సంగీత అభిమానులను ఆనందానికి గురి చేసింది. కళాకారుడికి ప్రాంతాలు, భాషలు అనే హద్దులు ఉండవని కేరళ ప్రజలు మరోసారి చాటి చెప్పారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు.16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సృష్టించారు. గాయకుడిగా మాత్రమే కాకుండా నటుడు, సంగీత దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఆయన తన ప్రతిభను చాటుకున్నారు.
2020లో కరోనా కారణంగా ఆయన మరణించినప్పటికీ, ఆయన గానం మాత్రం సంగీత ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.పాలక్కాడ్లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఆయనకు లభించిన అరుదైన గౌరవంగా నిలిచింది.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









