తాలిబ‌న్ల‌కు కంగ్రాట్స్ చెప్పిన అల్‌ఖైదా.. క‌శ్మీర్‌నూ విడిపించుకుంటామ‌ని ప్ర‌క‌ట‌న‌

- September 01, 2021 , by Maagulf
తాలిబ‌న్ల‌కు కంగ్రాట్స్ చెప్పిన అల్‌ఖైదా.. క‌శ్మీర్‌నూ విడిపించుకుంటామ‌ని ప్ర‌క‌ట‌న‌

కాబూల్‌: ఉగ్ర‌వాద సంస్థ అల్‌ఖైదా ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని తాలిబ‌న్ల‌ (Taliban)కు కంగ్రాట్స్ చెప్పింది. ఇలాగే ఇస్లామేత‌ర శ‌క్తుల నుంచి క‌శ్మీర్‌నూ విడిపించుకుందామ‌ని వాళ్ల‌కు పిలుపునిచ్చింది. అమెరికా సేన‌లు ఆఫ్ఘ‌న్‌ను విడిచి వెళ్లిన మ‌రుస‌టి రోజే అల్‌ఖైదా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇస్లాం శ‌త్రువుల నుంచి లెవాంట్‌, సోమాలియా, యెమెన్‌, క‌శ్మీర్‌తోపాటు ఇత‌ర ముస్లింల భూభాగాల‌ను విడిపించుకుందాం. ఓ అల్లా.. ప్ర‌పంచంలోని ముస్లిం ఖైదీలంద‌రికీ స్వేచ్ఛ ప్ర‌సాదించు అని ఆ ప్ర‌క‌ట‌న‌లో అల్‌ఖైదా చెప్పింది. అమెరికా సేన‌లు వెళ్ల‌గానే తాలిబ‌న్లు ఆఫ్ఘ‌నిస్థాన్‌కు పూర్తి స్వాతంత్ర్యాన్ని ప్ర‌క‌టించుకున్న విష‌యం తెలిసిందే.

ఆ కాసేప‌టికే అల్‌ఖైదా తాలిబ‌న్ల‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ.. ఈ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఆగ‌స్ట్ 30 అర్ధ‌రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా చివ‌రి విమానం టేకాఫ్ అయింది. దీంతో ఆ దేశంలో అగ్ర‌రాజ్యం రెండు ద‌శాబ్దాల యుద్ధం ముగిసింది. అస‌లు ఆఫ్ఘ‌న్‌లో ఈ యుద్ధానికి కార‌ణం ఈ అల్‌ఖైదానే.

2001, సెప్టెంబ‌ర్ 11న న్యూయార్క్‌లోని ట్విన్ ట‌వ‌ర్స్‌పై దాడిలో ప్ర‌ధాన సూత్ర‌ధారి అయిన అల్‌ఖైదా వ్య‌వ‌స్థాప‌కుడు బిన్ లాడెన్‌ను వెంటాడుతూ అమెరికా ఈ ఆఫ్ఘ‌నిస్థాన్‌కు వ‌చ్చింది. లాడెన్‌కు ఆశ్ర‌య‌మిచ్చిన తాలిబ‌న్ల‌ను అధికారంలో నుంచి దింపింది. అయితే 20 ఏళ్ల త‌ర్వాత అమెరికా తిరిగి వెళ్లిపోవ‌డంతో ఆఫ్ఘ‌నిస్థాన్ మ‌ళ్లీ తాలిబ‌న్ల చేతుల్లోకే వెళ్లిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com