క్వాల్‌కామ్‌ సీఈఓ క్రిస్టియానోతో ప్రధాని మోదీ భేటీ

- September 23, 2021 , by Maagulf
క్వాల్‌కామ్‌ సీఈఓ క్రిస్టియానోతో ప్రధాని మోదీ భేటీ

అమెరికా: మూడురోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ముందుగా ఐదు టాప్ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా ముందుగా టెక్ దిగ్గజ సంస్థ సెమీకండక్టర్ చిప్ తయారీ సంస్థ అయిన క్వాల్‌కామ్‌ సీఈఓ క్రిస్టియానో ఆర్ అమన్‌తో సమావేశమయ్యారు. దాదాపుగా 15 నిమిషాల పాటు ప్రధాని మోదీ చర్చలు జరిపారు. ఇప్పటికే క్వాల్‌కామ్ తమ సేవలను భారత్‌లో అందిస్తోందని ప్రధాని మోదీతో సమావేశం తర్వాత చెప్పారు ఆ సంస్థ సీఈఓ క్రిస్టియానో.

వైర్‌లెస్ టెక్నాలజీ, సెమీకండక్టర్స్, ఐటీ సేవలపై ప్రధాన దృష్టి సారించిన ప్రధాని మోదీ.. ఇదే అంశంపై క్వాల్‌కామ్ సీఈఓ క్రిస్టియానోతో చర్చించారు. భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీ సీఈఓ క్రిస్టియానోకు ఆహ్వానించారు. భారత్‌తో జతకట్టడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు క్రిస్టియానో. ప్రధాని మోదీతో 5జీ టెక్నాలజీ పై చర్చించినట్లు చెప్పారు. 5జీ సేవలను వేగవంతం చేయాలనే భావనతో ప్రధాని మోదీ ఉన్నారని ఆయన అన్నారు. భారత దేశం దేశీయంగానే కాకుండా సాంకేతికంగా ఎగుమతి దేశంగా ఆవిర్భవించాలనే అంశంపై చర్చించినట్లు క్రిస్టియానో చెప్పారు. భారత్‌లో పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ ఎంతో చొరవ చూపుతున్నారని క్రిస్టియానో చెప్పుకొచ్చారు.

ఇక భారత్‌లో చాలా అవకాశాలున్నాయని ప్రధాని మోదీ తనతో చెప్పినట్లు వివరించారు క్రిస్టియానో. డిజిటల్ ఇండియా, 5జీ టెక్నాలజీలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు క్రిస్టియానో ఆసక్తి చూపారు. వారి మధ్య చర్చలో సెమీకండక్టర్స్ అంశం ఆసక్తికరంగా మారిందని చెప్పుకొచ్చిన క్రిస్టియానో... భారత్‌లో మొబైల్ ఎకోసిస్టంను తీసుకొస్తామని చెప్పారు. దీనిపై సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. భారత్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని క్వాల్‌కామ్ సీఈఓ క్రిస్టియానో చెప్పారు. భారత్‌లో 5జీ సేవలకు కావాల్సిన అన్ని వనరులను ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ తనతో చెప్పినట్లు వెల్లడించాడు. క్వాల్‌కామ్ ఈ వనరులను వినియోగించుకుని భారత్‌లో మరింత పెట్టుబడులు పెట్టాలని మోదీ కోరినట్లు ఆయన వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com