కోవాగ్జిన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు సిద్ధమైన WHO

- October 26, 2021 , by Maagulf
కోవాగ్జిన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు సిద్ధమైన WHO

జెనీవా: కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే విషయాన్ని గత కొంతకాలంగా వాయిదా వేస్తూ వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది.. మరో 24 గంటల్లోగా కోవాగ్జిన్‌పై శుభవార్త చెబుతాం అంటున్నారు డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు. కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు సంబంధించిన మరింత డేటాను భారత్‌ బయోటెక్‌.. డబ్ల్యూహెచ్‌వోకి సమర్పించింది.. దీనిపై ఇవాళ డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా.. 24 గంటల్లో కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి ఆమోదం లభించే అవకాశం ఉందన్నారు గ్లోబల్ హెల్త్ బాడీ ప్రతినిధి మార్గరెట్ హారిస్.. మీడియాతో మాట్లాడిన ఆయన.. టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ప్రస్తుతం కరోనావైరస్ వ్యాధికి (కోవిడ్ -19) వ్యతిరేకంగా భారతదేశం దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‌ డేటాను సమీక్షిస్తున్నట్టు వెల్లడించారు.

ఇక, అన్నీ సక్రమంగా ఉంటే.. అన్నీ సరిగ్గా జరిగితే, కమిటీ సంతృప్తి చెందితే, మేం రాబోయే 24 గంటలలోపు సిఫార్సును ఆశిస్తున్నామని హారిస్ చెప్పినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా, ఇప్పటికే మిలియన్ల కొద్ది మంది భారతీయులు కోవాగ్జిన్‌ వేయించుకున్నారు.. కానీ, డబ్ల్యూహెచ్‌వో మాత్రం పెండింగ్‌లో పెడుతూ వచ్చింది.. హైదరాబాద్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇది ఏప్రిల్ 19 నాటికి అత్యవసర వినియోగ ఆమోదం కోసం దరఖాస్తు చేసుకుంది.. అయితే, గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చే ముందు కంపెనీ నుండి మరింత డేటా అవసరమని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.. దీంతో, అదనపు సమాచారాన్ని కూడా అందించింది ఆ సంస్థ. మరోవైపు, డబ్ల్యూహెచ్‌వో ఆమోదం లేకుండా, కోవాగ్జిన్‌ రెండు డోసులు వేయించుకున్నాసరే.. ప్రపంచవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యే పరిస్థితి ఉండదు. వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కంపల్సరీ చేసిన సందర్భంలో.. కోవాగ్జిన్‌ తీసుకున్నవారి అంతర్జాతీయ ప్రయాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. దీంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పే గుడ్‌న్యూస్‌ కోసం భారత్‌ బయోటెక్‌తోపాటు.. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ వేయించుకున్నవారు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com