వైకుంఠ ఏకాదశికి సిఫార్సు లేఖలు పంపవద్దు-వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి

- January 02, 2022 , by Maagulf
వైకుంఠ ఏకాదశికి సిఫార్సు లేఖలు పంపవద్దు-వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి

తిరుపతి: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22 వ తేదీ అర్ధరాత్రి వరకు పదిరోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు.

ఇందుకోసం ప్రముఖులు ఎవ్వరూ సిఫారసు లేఖలు పంపవద్దని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌లో ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకున్న సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని టీటీడీ కి సహకరించాలని ఆయన కోరారు.

పది రోజుల పాటు చైర్మన్ కార్యాలయంలో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టినందు వల్ల వైకుంఠ ఏకాదశి రోజున ప్రజా ప్రతినిధులకు తిరుమలలోని నందకం, వకుళ అథితి గృహాల్లో వసతి కల్పిస్తున్నామని, ఒక వేళ తిరుమలలో వసతి సరిపోకపోతే తిరుపతిలోనే బస పొందేందుకు సిద్ధపడి రావాలన్నారు.

శ్రీవాణి ట్రస్ట్ భక్తులు తిరుపతి లోని మాధవం, శ్రీనివాసం, శ్రీ పద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్‌లో వసతి పొందాలని చైర్మన్ తెలిపారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా విఐపిల దర్శన సమయం వీలైనంత తగ్గించి, సామాన్య భక్తులకు ఎక్కువ సమయం దర్శనానికి కేటాయించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com