రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్..

- January 06, 2022 , by Maagulf
రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్..

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు ఒక్కసారిగా భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే కేసుల సంఖ్య లక్షకు చేరువలో నమోదైంది. దీంతోపాటు కొత్తవేరియంట్ ఒమిక్రాన్ సైతం దేశంలో అలజడి సృష్టిస్తోంది. దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో మరోసారి కేంద్రం కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకు లేఖ రాసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితుల సహాయార్థం కోసం జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించింది. పెద్ద జిల్లా అయితే ఉప జిల్లా కంట్రోల్ రూమ్‌లను సైతం ఏర్పాటుచేసి సలహాలు సూచనలు ఇస్తూ.. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. అయితే ఈ కంట్రోల్ రూమ్స్‌లలో వైద్య సిబ్బంది, వలంటీర్స్, కౌన్సిలర్స్, జనాభాకు అనుగుణంగా తగినన్ని టెలిఫోన్లను అందుబాటులో ఉంచాలంటూ కేంద్రం లేఖలో స్పష్టంచేసింది. అంతేకాకుండా బ్రాడ్‌బాండ్‌తో కూడిన కంప్యూటర్లను అందుబాటులో ఉంచాలని వెల్లడించింది.

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య నమోదుకు అనుగుణంగా కంట్రోల్ రూమ్స్ 24 గంటలు పనిచేయాలని, వైరస్ బాధితులకు ఎప్పటికప్పుడు సహాయం అందించాలని పేర్కొంది. జిల్లా పరిధిలోని ఆసుపత్రుల్లో ఎక్కడెక్కడ బెడ్స్ అందుబాటులో ఉన్నాయో కంట్రోల్ రూమ్స్ ద్వారా మానిటరింగ్ చేస్తూ ఫోన్ కాల్స్‌లో సమాధానం చెబుతుండాలని సూచించింది. కరోనా కేసులు ఎక్కువగా పెరుగుదల ఉన్న ప్రాంతాల్లో వైరస్ బాధితులను తరలించేందుకు వీలుగా కంట్రోల్ రూమ్స్ వద్ద అందుబాటులో అవసరమైనన్ని అంబులెన్సులను ఉంచాలని సూచించింది. దీంతోపాటు హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు క్రమం తప్పకుండా ఫోన్ చేసి వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీయాలని కేంద్రం రాష్ట్రాలకు రాసిన లేఖలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com