టాటాకు ఎయిరిండియా ఎయిర్లైన్స్ అప్పగింత ప్రక్రియ పూర్తి

- January 27, 2022 , by Maagulf
టాటాకు ఎయిరిండియా ఎయిర్లైన్స్ అప్పగింత ప్రక్రియ పూర్తి

న్యూఢిల్లీ: ఎయిరిండియా ఎయిర్లైన్స్ సంస్థ ను టాటా గ్రూప్‌నకు అప్పగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం పూర్తి చేసింది.ఎయిరిండియా-స్పెషల్ పర్పస్ వెహికిల్ AIAHL మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. దాదాపు 69 సంవత్సరాల తర్వాత సుప్రసిద్ధ 'మహారాజా’ను ఇక పూర్తిగా  టాటా గ్రూప్ సొంతం చేసుకుంది.శుక్రవారం నుంచి ఎయిరిండియా కార్యకలాపాలు పూర్తిగా టాటా గ్రూప్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. 

గురువారం ఉదయం ఎయిరిండియా బోర్డు చివరి సమావేశం జరిగింది. టాటా గ్రూప్‌‌నకు ఈ సంస్థను అప్పగించేందుకు వీలుగా ఈ బోర్డు రాజీనామా చేసింది. ఎయిరిండియా అమ్మకానికి రూ.18,000 కోట్లకు టాటా గ్రూప్‌తో ప్రభుత్వం గత ఏడాది షేర్ పర్చేజ్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసింది. టాటా గ్రూప్ రూ.2,700 కోట్లు నగదు రూపంలో ప్రభుత్వానికి చెల్లించి, రూ.15,300 కోట్ల మేరకు అప్పులను స్వాధీనం చేసుకుంది. ఈ సంస్థను 1932లో టాటా గ్రూప్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా స్వాధీనంతో విమానయాన రంగంలో దాదాపు 27 శాతం మార్కెట్ వాటాను కలిగియుండే సంస్థగా టాటా గ్రూప్ మారబోతోంది. 

అంతకుముందు టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.ఎయిరిండియా 101 డెస్టినేషన్స్‌కు విమానాలను నడుపుతున్నట్లు 2020నాటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. దేశీయంగా 57 గమ్యస్థానాలకు వైమానిక సేవలను అందిస్తోంది. నాలుగు ఖండాల్లోని 33 దేశాలకు కూడా సేవలందిస్తోంది. 

ఇదిలా ఉంటే...ఎయిరిండియా ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహాన్ని కొనసాగిస్తున్నాయి. తమకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు, బకాయిలకు ఏ మాత్రం కోత పెట్టినా, రికవరీలకు దిగినా సహించేంది లేదని హెచ్చరిస్తూ ఇండియన్‌ పైలెట్స్‌ గిల్డ్‌ (ఐపీజీ), ఇండియన్‌ కమర్షియల్‌ పైలెట్స్‌ అసోసియేషన్‌ (ఐసీపీఏ) ఎయిరిండియా సీఎండీ విక్రందేవ్‌ దత్‌కు ఉద్యోగ సంఘాలు లేఖ రాశాయి. అవసరమైతే ఈ విషయంలో కోర్టుకెళతామంటూ హెచ్చరిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com