కస్టమ్స్ లో స్వల్ప మార్పులు

- April 01, 2016 , by Maagulf
కస్టమ్స్ లో స్వల్ప మార్పులు

విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు తమతో పాటు 'సుంకం చెల్లించదగ్గ వస్తువులు' తీసుకుని రాకపోతే విమానాశ్రయాల్లో సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని నింపాల్సిన అవసరం ఉండదని కస్టమ్స్‌శాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. నిషేధించిన, సుంకం చెల్లించాల్సిన వస్తువుల్ని తీసుకువచ్చేవారే ఈ పత్రాలను నింపాలని తెలిపింది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2016-17 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఈ మార్పుల్ని ప్రకటించారు. మద్యం, సిగరెట్లు, సిగార్స్‌, పొగాకులపై ఇప్పుడున్న పరిమితి కొనసాగుతుంది. నేపాల్‌, భూటాన్‌, మయాన్మార్‌ మినహా ఏ దేశం నుంచి వస్తున్నవారైనా తమ వెంట తెచ్చుకునే నగదు పరిమితిని రూ.

45,000 నుంచి రూ.50,000కి పెంచారు. ఈ మూడు దేశాల నుంచి వచ్చేవారికి సుంకం రహిత భత్యాన్ని రూ.6000 నుంచి రూ.15,000కి పెంచారు. చైనా నుంచి వచ్చేవారు ఇప్పటి వరకు రూ.6000 విలువైన సుంకం రహిత వస్తువుల్ని తెచ్చుకునేందుకు అనుమతిస్తుండగా ఇకపై దీనికి వీలుండదు. వాయు మార్గాన వచ్చేవారికే రాయితీల పెంపు వర్తిస్తుంది. ఇతర మార్గాల్లో వచ్చేవారికి ఎలాంటి రాయితీలు ఉండవు. విదేశీయులకు ఇచ్చే రాయితీని రూ.8000 నుంచి రూ.15000కి పెంచారు. విమానాశ్రయాల్లో దిగాక క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా ప్రయాణికులకు విమానాల్లోనే కస్టమ్స్‌ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సిందిగా అన్ని విమానయాన సంస్థలకూ తెలిపినట్లు దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్‌ కమిషనర్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com