శాశ్వత ఉద్యోగులకు షాకిచ్చిన ఎయిరిండియా

- June 02, 2022 , by Maagulf
శాశ్వత ఉద్యోగులకు షాకిచ్చిన ఎయిరిండియా

న్యూఢిల్లీ : శాశ్వత ఉద్యోగులకు ఎయిరిండియా షాకిచ్చింది. ఎయిరిండియా సంస్థలో శాశ్వత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్‌ఎస్‌) పథకాన్ని ప్రకటించింది.

శాశ్వత ఉద్యోగుల సంఖ్యను తగ్గించడంతో పాటు వివిధ విభాగాల్లో నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు వివరించింది. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను ఇటీవల టాటా గ్రూప్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

20 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకొని 55 ఏళ్లు పైబడిన వారు ఈ విఆర్‌ఎస్‌ను ఎంచుకోవచ్చని, క్యాబిన్‌ సిబ్బంది అయితే 40 ఏళ్లు పైబడిన వారు తీసుకోవచ్చని విఆర్‌ఎస్‌ మెమోలో ఎయిరిండియా పేర్కొంది. విఆర్‌ఎస్‌ను ఎంచుకున్నవారికి ఎక్స్‌గ్రేషియాతో పాటు అదనంగా ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని తెలిపింది. విఆర్‌ఎస్‌ తీసుకోవాలనుకుంటున్న ఉద్యోగులు జూన్‌ 1 నుండి జూన్‌ 30 మధ్య తమ ప్రాంతీయ అధికారిని సంప్రదించాలని సూచించారు. అదే సమయంలో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ప్రత్యర్థి కంపెనీలకు చెందిన ఉద్యోగులతో పాటు టాటా గ్రూప్‌లోని మిగిలిన సంస్థల్లో పనిచేస్తున్న నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఎయిరిండియాలోని కీలక పదవుల్లో నియమిస్తున్నట్లు సంబంధిత వ్యక్తి తెలిపారు.

సంస్థలో మొత్తం 12,085 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 8,084మంది శాశ్వత ఉద్యోగులు, 4,001 కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఎయిరిండియా ఎక్స్‌ ప్రెస్‌లో 1,534 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు ఎయిరిండియా సిఎండి రాజీవ్‌ బన్సాల్‌ ఒక నివేదికలో తెలిపారు. నివేదిక ప్రకారం.. వచ్చే 5 ఏళ్లలో సంవత్సరానికి వెయ్యి మంది చొప్పున మొత్తం 5వేల మంది ఉద్యోగులు పదవీవిరమణ పొందనున్నారు.ఇక విఆర్‌ఎస్‌ తీసుకోవాల్సిన వారిలో శాశ్వత ఉద్యోగులతో పాటు, ఎయిరిండియా ఎక్స్‌ ప్రెస్‌లో పైలెట్‌లను మినహాయించి మిగిలిన విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కూడా ఉన్నట్లు సంస్థ తెలిపింది.దీంతో విఆర్‌ఎస్‌ నిర్ణయం ఉద్యోగులకు నష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com