బస్ టికెట్ కొంటే.. తిరుమల శ్రీవారి దర్శన టికెట్..

- June 05, 2022 , by Maagulf
బస్ టికెట్ కొంటే.. తిరుమల శ్రీవారి దర్శన టికెట్..

హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది.తిరుమల తిరుపతి వెళ్లే భక్తులు టీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే వారికి బస్సు టికెట్‌తో పాటు తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు టికెట్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ), టీఎస్ ఆర్టీసీ మధ్య అంగీకారం కుదిరింది. దీంతో ప్రతీ రోజూ రూ.300 దర్శనానికి సంబంధించి వెయ్యి టికెట్లను టీఎస్ ఆర్టీసీ వెబ్ సైట్ బుక్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. బస్సు టికెట్ తో పాటు అదనంగా రూ.300 చెల్లించి స్వామివారి దర్శనం టికెట్ ను పొందవచ్చు.

టీఆర్ఎస్ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సారథ్యంలో పలు స్కీంలు అమలు చేస్తూ ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో టీటీడీతో తాజా ఒప్పందం ఆర్టీసీకి మేలు చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి లక్షలాది మంది వెళ్తారు. స్వామివారి దర్శన టికెట్లు సకాలంలో దొరక్క ఇబ్బందులు పడుతుంటారు.

ఈ క్రమంలో టీఎస్ ఆర్టీసీలో రోజు వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంచనుండటంతో తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఆర్టీసీ ప్రయాణీకులు తిరుమల ప్రత్యేక దర్శనానికి రెండు రోజుల ముందు ఆన్ లైన్ పోర్టల్ ద్వారా టికెట్‌ను బుక్ చేసుకోవాలని సజ్జనార్ తెలిపారు.ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో టీటీడీ టికెట్లు పొందే వీలుంది. అయితే తెలంగాణలో సర్వీస్ చార్జీపై నిర్ణయం తీసుకొని సాప్ట్ వేర్‌ను రూపొందించాక టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభించే తేదీని వెల్లడిస్తామని టీఎస్ ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com