పంజాబ్‌లో ఎన్‌కౌంటర్..

- July 20, 2022 , by Maagulf
పంజాబ్‌లో ఎన్‌కౌంటర్..

పంజాబ్: ఇటీవల మరణించిన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హంతకులకు, పోలీసులకు మధ్య పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ జరుగుతోంది.ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక గ్యాంగ్‌స్టర్ మరణించినట్లు సమాచారం.అమృత్‌సర్ సమీపంలోని, అత్తారి సరిహద్దులో ఉన్న భన్కా గ్రామంలో బుధవారం మధ్యాహ్నం నుంచి ఈ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.

సిద్ధూ మూసేవాలా హంతకులుగా భావిస్తున్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్ ఈ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇద్దరినీ పట్టుకోవడానికి భన్కా గ్రామాన్ని చుట్టుముట్టారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య వందల రౌండ్ల కాల్పులు జరిగాయి. తాజా సమాచారం ప్రకారం ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్‌లో ఒకడైన జగ్‌రూప్ సింగ్ అలియాస్ రూప హతమయ్యాడు. మరో గ్యాంగ్‌స్టర్ మన్‪‌ప్రీత్ సింగ్ అలియాస్ మన్ను కుసా కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మన్ను కుసా కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాడు.

ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం. సిద్ధూ హత్యకు ప్రముఖ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కుట్ర పన్నిన సంగతి తెలిసిందే. సిద్ధూను చంపే బాధ్యతను షూటర్లైన మన్‪‌ప్రీత్ సింగ్‌కు, జగ్‌రూప్ సింగ్‌కు అప్పగించాడు. వీరి ఆధ్వర్యంలోనే సిద్ధూ హత్య జరిగినట్లు అంచనా. ఇంకా ఈ ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది.యాంటీ-గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ విక్రమ్ బ్రార్ ఆధ్వర్యంలో ఈ ఎన్‌కౌంటర్‌ సాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com