గల్ఫ్ కార్మికుల సమస్యల గురించి పొన్నం ప్రభాకర్ కు లేఖ

- August 10, 2022 , by Maagulf
గల్ఫ్ కార్మికుల సమస్యల గురించి పొన్నం ప్రభాకర్ కు లేఖ
టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాదయాత్ర రెండవ రోజున బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా.. టిపిసిసి గల్ఫ్ ఎన్నారై కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి గల్ఫ్ కార్మికుల సమస్యల గురించి పొన్నం కు ఒక లేఖ రాశారు. 
 
శ్రీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ, కరీంనగర్ గారికి నమస్కరించి వ్రాయునది.
 
మీ పాదయాత్ర సందర్భంగా... గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఈ విషయంపై మీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించాలి. 
 
కరోనా సందర్బంగా గల్ఫ్ తదితర దేశాల నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి యాజమాన్యాల నుండి రావలసిన  జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్,  గ్రాట్యుటీ లాంటి 'ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్' (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు)  రాబట్టుకోవడం వారి హక్కు. దీనికి బాధితుల పక్షాన ప్రభుత్వాలు నిలబడి న్యాయ సహాయం అందించి కార్మికులను ఆదుకోవాలి.    
 
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 15 లక్షల మంది గల్ఫ్‌ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఓమన్, ఖతర్, కువైట్‌, బహ్రెయిన్ దేశాలతో పాటు మలేషియా, సింగపూర్, అఫ్గానిస్తాన్, ఇరాక్, లిబియా తదితర  దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారు.  వీరందరి సంక్షేమం కోసం 'గల్ఫ్ బోర్డు' ఏర్పాటు చేయాలి. 
 
ముఖ్యమైన డిమాండ్లు ఇవి:
 
● భారత ప్రభుత్వం దౌత్యపరంగా కృషి చేసి... యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ దేశాలను ఒప్పించి హైదరాబాద్ లో కాన్సులేట్ (రాయబార కార్యాలయాలు) ఏర్పాటు చేయించాలి.
 
● 'ప్రవాసి భారతీయ బీమా యోజన' అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పాలసీ కొరకు రెండేళ్ల కోసం రూ. 325 ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత ఆన్ లైన్ లో రెనివల్ చేసుకోవచ్చు.  ఈ ఇన్సూరెన్స్ కేవలం ప్రమాద మరణం (యాక్సిడెంట్ డెత్) కు మాత్రమే వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సహజ మరణం (నేచురల్ డెత్) కూడా కవర్ అయ్యేలా చర్యలు ఇన్సూరెన్స్ లోని నిబంధనలు సవరించాలి. అవసరమైతే కొంచెం ప్రీమియం పెంచండి లేదా సబ్సిడీ ఇవ్వండి. ఇది గల్ఫ్ మృతులకు ఎంతో ఉపయోగపడే విలువైన అంశం. గత 8 సంవత్సరాలలో గల్ఫ్ దేశాలలో సుమారు 1,600 మంది తెలంగాణ వలస కార్మికులు మృతి చెందారు.
 
● గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. 
 
● గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు వీసా చార్జీలు, రిక్రూట్మెంట్ ఫీజులు తదితర ఖర్చులకోసం రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలి.  
 
● గల్ఫ్ లో చనిపోయిన కార్మికులకు రైతు బంధు, రైతు బీమా లాంటి రూ. 5 లక్షల  "గల్ఫ్ ప్రవాసీ బీమా" పథకం ప్రవేశపెట్టాలి. ఈ పథకం ప్రవేశపెడితే ప్రభుత్వంపై ఎక్స్ గ్రేషియా (మృతధన  సహాయం) భారం ఉండదు.   
 
● విదేశాలకు వెళ్లి నష్టపోయి తిరిగి వచ్చిన వారిని ఆదుకోవడానికి కార్మికుల నైపుణ్యం మరియు అనుభవాన్ని ఉపయోగించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు  బ్సిడీతో కూడిన రుణాలను ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలను తక్షణం  కల్పించాలి. వాపస్ వచ్చినవారు జీవితంలో స్థిరపడటానికి పునరావాసం, పునరేకీకరణ కొరకు ప్రత్యేక పథకం రూపకల్పన చేయాలి.
 
● జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) ఇవ్వాలి. 
 
● గల్ఫ్ కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణం వంటి పథకాలను వర్తింపజేయాలి.
 
● గల్ఫ్ కార్మికుల పిల్లలకు విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి
 
● విదేశాల్లో ఉన్న వలసకార్మికులు, ఉద్యోగులు, వృత్తినిపుణులు, విద్యార్థుల రిజిస్ట్రేషన్ కొరకు 'ప్రవాసి తెలంగాణ' వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలి .
 
● గల్ఫ్ ఎన్నారైలు తమ అమూల్యమైన  ఓటు హక్కును ఆన్ లైన్ ద్వారా  వినియోగించుకునేలా చేయాలి. 
 
 ఇట్లు  
 
 సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ కన్వీనర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి), ఎన్నారై సెల్ - ప్రవాస భారతీయుల విభాగం.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com