గల్ఫ్‌లో మోడల్ రెసిడెంట్‌లుగా భారతీయ కార్మికులు

- December 22, 2022 , by Maagulf
గల్ఫ్‌లో మోడల్ రెసిడెంట్‌లుగా భారతీయ కార్మికులు

న్యూఢిల్లీ: గల్ఫ్‌కు వెళ్లే భారతీయ వలస కార్మికులకు ఆయా దేశాల సంస్కృతి, భాష , సంప్రదాయాల గురించి అవగాహన కల్పించే “ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ అండ్ ట్రైనింగ్ (PDOT)’’ పథకం ద్వారా 121,596 మంది విదేశీ ఉద్యోగార్ధులకు శిక్షణ ఇచ్చినట్లు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తెలిపారు. భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో ఈ మేరకు ప్రకటించారు. 2018లో ప్రవేశ పెట్టిన ఈ పథకం విజయవంతమైందన్నారు. ఉపాధి కోసం ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లే భారతీయులందరికీ PDOT పథకం అందుబాటులో ఉన్నదని, ఇప్పటివరకు శిక్షణ పొందిన వారిలో ఎక్కువ మంది GCC దేశాలకు వలస వెళ్లారన్నారు. ఈ పథకం ద్వారా ఆయా దేశాలకు వెళ్లే వారికి సురక్షితమైన, చట్టబద్ధమైన మార్గాల గురించి వలస కార్మికులకు అవగాహన కల్పిస్తుందని మురళీధరన్ ఎంపీ KR సురేష్ రెడ్డికి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు. ఇటువంటి శిక్షణ గల్ఫ్‌లోని భారతీయులు వారు నివసించే దేశాలలో మోడల్ రెసిడెంట్‌లుగా ఉండటానికి వీలు కల్పిస్తుందని, PDOT శిక్షణ భారతీయ ప్రవాసులకు వారి సంక్షేమం, రక్షణ కోసం వివిధ ప్రభుత్వ కార్యక్రమాల గురించి అవగాహన కలిగిస్తుందని మంత్రి తెలిపారు. కోర్సులో చేరిన వారికి PDOT శిక్షణ ఉచితమని, నాలుగేళ్ల క్రితం నాలుగు కేంద్రాలతో ప్రారంభమైందన్నారు. శిక్షణ కోసం ఉన్న డిమాండ్ దృష్ట్యా, ఇది ఇప్పుడు భారతదేశంలోని 31 నగరాల్లో అందుబాటులో ఉందన్నారు. కేరళ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, న్యూ ఢిల్లీ, ముంబై వంటి రాష్ట్రాలలో శిక్షణ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com