సినీ కార్మికుల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి
- December 29, 2022
హైదరాబాద్: సినీ కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అవసరం వచ్చినప్పుడు వారి వెంట ఉంటానని, కష్టం వస్తే తన ఇంటి తలుపు తట్టాలని అన్నారు. చిత్రపురి కాలనీలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నిర్మాతలు సి కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ఎఫ్ డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, ఫిలించాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, మణికొండ మున్సిపల్ లీడర్స్ తదితరులు పాల్గొన్నారు. నేడు చిత్రపురిలో 1,176 ఎంఐజీ, 180 హెచ్ఐజీ డూప్లెక్స్ ఫ్లాట్స్ ఓనర్స్ కు చిరంజీవి చేతుల మీదుగా ఇంటి తాళాలు అందజేశారు. అనంతరం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తోందన్నారు. సినీ రంగానికి, ఇక్కడి కార్మికులకు ఎప్పుడూ అండగానే ఉంటున్నామన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వారికి ఇళ్ల నిర్మాణం చేసిన కమిటీకి అభినందనలు తెలిపారు. ఏ పనిచేసినా తప్పుఒప్పులు జరుగుతుంటాయన్నారు. ధైర్యంగా ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కాలనీలో మంచి నీటి సమస్య ఉందని, అధికారులతో మాట్లాడి మిషన్ భగీరథ పైప్ లైన్ వచ్చేలా చేస్తానని తెలిపారు. అలాగే చిత్రపురి కాలనీలోనే రేషన్ షాప్, ఆస్పత్రి నిర్మాణం, ఇతర మౌళిక వసతులు కల్పిస్తామన్నారు.
చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ... 22 ఏళ్ల క్రితం ఇదే రోజున 2000 సంవత్సరం డిసెంబర్ 29న చిత్రపురి కాలనీకి పునాది రాయి వేసుకున్నామన్నారు. ఇప్పుడు ఇన్నేళ్లకు ఈ పెద్దలందరి చేతుల మీదుగా గృహప్రవేశ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్మికుల గృహ ప్రవేశం అని చెప్పగానే తప్పకుండా వస్తాను అని చిరంజీవి ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు.కమిటీ గెలవగానే మిగిలిన గృహ నిర్మాణాలు పూర్తి చేస్తామని వాగ్ధానం చేశామని తెలిపారు. మాటిచ్చినట్లుగానే ఇవాళ ఇళ్లు కట్టి ఇవ్వడం సంతృప్తిగా ఉందన్నారు. చిత్రపురి సొసైటీ లోటు బడ్జెట్ లో ఉన్న క్రమంలో మా కమిటీకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పుడు చిరంజీవి లాంటి పరిశ్రమ పెద్దలు, ప్రభుత్వం నుంచి మంత్రులు తమకు అండగా నిలబడి సపోర్ట్ చేశారన్నారు.ప్రస్తుతం కాలనీలో మంచినీటి సమస్య సహా కొన్ని మౌళిక వసతుల కొరత ఉందన్నారు. ఆ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరించుకుంటామన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... మా సినీ కార్మికుల సమక్షంలోకి అతిథిగా రావడం సంతోషంగా ఉందన్నారు. మనం తిన్నా తినకున్నా మనకొక ఇళ్లు ఉండటం అనే తృప్తే వేరు. ఆ సొంతింటి కలను మన సినీ కార్మిక సోదరులకు నిజం చేసిన ఈ చిత్రపురి కమిటీకి అభినందనలు తెలిపారు. ఈ సమయంలో స్వర్గీయ ఎం.ప్రభాకర్ రెడ్డిని మనం గుర్తు చేసుకోవాల్సి ఉందని తెలిపారు. ఆయన దూరదృష్టితో ఈ సొసైటీ కోసం చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ఆయన కల ఇవాళ నెరవేరిందన్నారు. దాసరి, రాఘవేంద్రరావు, భరద్వాజ లాంటి వారందరూ దీన్నోక అద్భుతమైన సొసైటీగా తీర్చిదిద్దారు. భారత దేశంలో మరే సినీ పరిశ్రమలోనూ సినిమా కార్మికులకు ఇంత పెద్ద గృహసముదాయం లేదు.ఈ కమిటీ చాలా నిజాయితీగా పనిచేస్తుండటం వల్లే పనులు జరుగుతున్నాయి. సి కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్లంతా తనను ఇండస్ట్రీ పెద్ద అంటున్నారని, వాళ్ల వయసు తగ్గించుకునేందుకు నన్ను పెద్ద అంటున్నారేమో అనిపిస్తోందన్నారు. చిత్ర పరిశ్రమ నాకెంతో ఇచ్చిందని, అందులో నుంచి తన వంతుగా సినీ కార్మికులకు, కళాకారులకు సాయం చేస్తానన్నారు. తను ఎదిగానని పెద్దరికం చేయాలని లేదన్నారు.
ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేంద్ర, వైస్ ఛైర్మన్ నరేంద్ర రెడ్డి, కౌన్సిలర్లు వల్లభనేని హైమాంజలి అనిల్ కుమార్, వసంత్ రావు చౌహన్,సంయుక్త ప్రభాకర్ రెడ్డి, చిత్రపురి కమిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ యాదవ్, సెక్రటరీ పీఎస్ఎన్ దొర, ట్రెజరర్ లలిత, సభ్యులు డా.అళహరి వీవీ ప్రసాదరావు, బత్తుల రఘు, కొంగర రామకృష్ణ, దీప్తి వాజ్ పాయ్,వెంకట అప్పారావు,అనిత నిమ్మగడ్డ, మహానందరెడ్డి, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!