టర్కీ భూకంప శిథిలాల్లో భారతీయుడి మృతదేహం లభ్యం..

- February 11, 2023 , by Maagulf
టర్కీ భూకంప శిథిలాల్లో భారతీయుడి మృతదేహం లభ్యం..

టర్కీలో కనిపించకుండాపోయిన భారతీయుడి మృతదేహం అక్కడి భూకంప శిథిలాల్లో లభించింది.శనివారం నిర్వహించిన సహాయక చర్యల్లో విజయ్ కుమార్ అనే భారతీయుడి మృతదేహాన్ని గుర్తించినట్లు అక్కడి అంకారాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

టర్కీ, సిరియాల్లో సోమవారం భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ భూకంపంలో 27,000 మందికి పైగా పౌరులు మరణించారు. సోమవారం నుంచి విజయ్ కుమార్‌కు సంబంధించిన సమాచారం కూడా లభించలేదు. అప్పటి నుంచి అతడి గురించి అన్వేషణ కొనసాగింది. తాజాగా అక్కడి మాలాత్యా పట్టణంలోని ఒక హోటల్ శిథిలాల్లో అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన విజయ్ కుమార్ వ్యాపార పని నిమిత్తం టర్కీ వెళ్లాడు. హోటల్‌లో బస చేయగా, సోమవారం నాటి భూకంపంలో మరణించాడు. విజయ్ కుమార్ మృతిపై భారతీయ రాయబార కార్యాలయం సంతాపం ప్రకటించింది.

అతడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్ పంపించేందుకు కృషి చేస్తామని తెలిపింది. విజయ్ కనిపించడం లేదని విదేశీ వ్యవహారాల శాఖ ఈ నెల 8న ప్రకటించింది. మరోవైపు టర్కీ, సిరియాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత్ టర్కీతోపాటు సిరియాకు కూడా సాయం అందిస్తోంది.వైద్య సహాయం, ఔషధాలు వంటివి భారత్ అందిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాలు భూకంప బాధిత దేశాలకు సహాయం చేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com