ఒడిశా-తెలంగాణ ఆర్టీసీల మధ్య కుదిరిన ఒప్పందం..
- February 22, 2023
ఒడిశాకు బస్ సర్వీసులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో 10 బస్సులను తిప్పేందుకు సిద్ధమైంది.ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్ సర్వీసుల ఏర్పాటుపై ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(OSRTC)తో టీఎస్ఆర్టీసీ ఒక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ బస్ భవన్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ సమక్షంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఓఎస్ఆర్టీసీ ఎండీ దిప్తేష్ కుమార్ పట్నాయక్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వాటిని పరస్పరం అందజేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. టీఎస్ఆర్టీసీ 10 బస్సులను ఒడిశాకు.. ఓఎస్ఆర్టీసీ 13 సర్వీస్లను తెలంగాణకు నడపనుంది.
హైదరాబాద్-జైపూర్ 2, ఖమ్మం-రాయఘఢ 2, భవానిపట్న – విజయవాడ (వయా భద్రాచలం) 2, భద్రాచలం-జైపూర్ 4 బస్సు సర్వీసులను టీఎస్ఆర్టీసీ నడపనుంది.నవరంగ్పూర్-హైదరాబాద్ 4, జైపూర్-హైదరాబాద్ 2, భవానిపట్న-విజయవాడ(వయా భద్రాచలం) 2, రాయఘఢ-కరీంనగర్ 2, జైపూర్-భద్రాచలం 3 బస్సులను ఓఎస్ఆర్టీసీ తిప్పనుంది.
తెలంగాణ-ఒడిశా మధ్యలో ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారని, డిమాండ్ నేపథ్యంలో ఓఎస్ఆర్టీసీతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించామని, ఆయా మార్గాల్లో 10 బస్సులతో ఒడిశాలో 3378 కిలోమీటర్ల మేర నడపాలని సంస్థ నిర్ణయించిందని తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రజలు ఈ బస్సు సర్వీస్లను వినియోగించుకుని, క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.
టీఎస్ఆర్టీసీ తీసుకువచ్చిన పలు కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఓఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా వివరించారు. టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఓఎస్ఆర్టీసీ ఎండీ దిప్తేష్ కుమార్ పట్నాయక్ ప్రశంసించారు. తమ రాష్ట్రంలోనూ వాటిని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ ఒప్పందం వల్ల రెండు సంస్థల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం 13 బస్సు సర్వీస్లతో తెలంగాణలో 2896 కిలోమీటర్ల మేర నడుపుతన్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







