సైబరాబాద్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

- March 09, 2023 , by Maagulf
సైబరాబాద్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

సైబరాబాద్: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని(మార్చ్ 8) పురస్కరించుకొని ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. 

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ  కుమార్, ఐపీఎస్., మాట్లాడుతూ.. స్వీయ రక్షణ తో పాటు సామాజిక సేవకు ముందుండాలి అన్నారు. పోలీసు వ్యవస్థ అనేది  ఒక పెద్ద కుటుంభం లాంటిది అన్నారు. మహిళ సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల ధృష్టికి తీసుకురావాలన్నారు. 

మహిళ దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి డిజిపి  బహుమతులు ప్రదానం చేశారు. మహిళలు ఆత్మ స్థైర్యం తో ఉండాలన్నారు. సమాజానికి ఒక స్ఫూర్తి  గా నిలవాలన్నారు. 

అనంతరం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫన్ రవీంద్ర, ఐపీఎస్., మాట్లాడుతూ ముందుగా వేధిక మీద ఉన్న అందరికీ అభినందనలు తెలిపారు.సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో పనిచేస్తున్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది “ EmbraceEquity - DigitALL: Innovation and Technology for Gender Equality” అనే థీమ్ తో విమెన్స్ డే జరుపుకుంటున్నామన్నారు. ఇదే నినాదంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ఏటా నిర్వహిస్తోందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలకు ప్రతీకగా/ గుర్తుగా జరుపుకునే ప్రపంచ దినోత్సవమన్నారు. ఐటి కారిడార్ లో అత్యధిక సంఖ్యలో మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. వారందరికీ షీ టీమ్స్ రక్షణ కల్పిస్తుందన్నారు. తల్లిదండ్రులు అబ్బాయిలను, అమ్మాయిలను సమానంగా చూడాలన్నారు. అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావలన్నారు. వృత్థిపరంగా నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలన్నారు. నేర్చ్చుకోవడం అనేది జీవితంలో ఒక నిరంతర ప్రక్రియ కావాలన్నారు. ఏదైనా ఒక అంశంపై తమ ప్రత్యేకతను చాటాలన్నారు.

అనంతరం విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి నికిత పంత్. ఐపిఎస్ ., మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో భాగంగా షీ టీమ్స్ మహిళల భద్రతకు ఏడాది పొడవునా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. 

అనంతరం డిసిపి శ్రీమతి కవిత మాట్లాడుతూ  ఒకప్పుడు ఇంటి వరకే పరిమితమైన మహిళలు నేడు అన్నీ రంగాల్లో రాణిస్తున్నారన్నారు. మహిళలు తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలు చేరాలన్నారు. ఒక వ్యక్తిని విద్యావంతులను చేస్తే కేవలం ఆ వ్యక్తిని మాత్రమే విద్యావంతులను చేస్తారు. అయితే ఒక స్త్రీని విద్యావంతురాలిని చేస్తే, మొత్తం కుటుంబాన్ని, ఒక తరాన్ని విద్యావంతులను చేస్తారన్నారు. 

డిసిపి మదాపుర్ శ్రీమతి శిల్పవల్లి  మాట్లాడుతూ తల్లిగా, చెల్లిగా, అక్కగా, అర్థాంగి గా మహిళ వివిధ పాత్రలను పోషిస్తుందన్నారు. మహిళల అటు ఇంటిని, విధి నిర్వహణను ఏక కాలంలో నిర్వర్తించడం గొప్ప విషయం అన్నారు. 

అనంతరం ఏడీసీపీ క్రైమ్స్ కవిత మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలకు అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళల భద్రతా కోసం సైబరాబాద్ పోలీసులు అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. 

ఏడీసీపీ రాజేంద్రనగర్ సాధన రశ్మి పెరుమాళ్, ఐపిఎస్., మాట్లాడుతూ ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్నారు. దేశాభివృద్ధిలో మహిళలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలమన్నారు. అనంతరం బెలూన్ లను ఎగురవేశారు. వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన పోలీస్ కళాబృందం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 

ఈ కార్యక్రమంలో  తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్  స్టీఫన్ రవీంద్ర,విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి నికిత పంత్,ఏడీసీపీ రాజేంద్రనగర్ సాధన రేశ్మి పెరుమాళ్, ఐపిఎస్., డిసిపి మదాపుర్ శిల్పవల్లి, డిసిపి, కవిత, సీఏఓ (అకౌంట్స్) చంద్రకళ, సీఏఓ (అడ్మిన్) గీత , షీ టీమ్స్ సిబ్బంది, షీ టీమ్స్ ఇన్ స్పెక్టర్ సునీత, మినిస్టీరియల్ స్టాఫ్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com