తెలంగాణలో లక్షా 32వేల ఉద్యోగాలిచ్చాం: మంత్రి జగదీశ్ రెడ్డి

- April 16, 2023 , by Maagulf
తెలంగాణలో లక్షా 32వేల ఉద్యోగాలిచ్చాం: మంత్రి జగదీశ్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 32వేల ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. కానీ, మేము ఎవరికీ చెప్పుకోలేదన్నారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. దేశంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని మంత్రి జగదీశ్ రెడ్డి నిలదీశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, సైదిరెడ్డి పాల్గొన్నారు.

కేంద్రం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు ప్రకటిస్తే మన రాష్ట్రానికి 8 అవార్డులు వచ్చాయని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. 25 ఏళ్లుగా మోదీ నాయకత్వంలో ఉన్న గుజరాత్ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా రాలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆడుతున్న నాటకం చూస్తున్నామన్నారు.

”నిరుద్యోగ యువత గురించి ఇవాళ మాట్లాడుతున్నారు, దేశంలో కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు.ఈ మాట స్వయంగా మోడీ ఎన్నికల్లో మాట్లాడారు. మరి, ఇప్పటివరకు ఎంతమందికి కేంద్రం ఉపాధి కల్పించిందో చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో లక్ష 32వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాము. కానీ, మేము ఎవరికి చెప్పుకోలేదన్నారు.

మీరు పరిపాలన చేస్తున్న మహారాష్ట్ర, గుజరాత్ లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చూపిస్తారా..? బీజేపీ ప్రభుత్వం యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. పేపర్ లీక్ జరిగింది. వాస్తవానికి బీజేపీ కార్యకర్తలు చేసిన పనిని కూడా మనం అనుమాన పడలేదు. తెల్లారేసరికి అసలు దొంగ దొరికాడు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి, బీజేపీ అధ్యక్షుడికి చదువు రాదు. చదువు విలువ తెలియదు. రాహుల్ గాంధీ ఇంట్లో సమన్లు బయట పడేసినా నోరుమెదపరు. బీజేపీ, కాంగ్రెస్.. టీమ్ గా పని చేస్తున్నాయి. బండి సంజయ్ కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తోంది” అని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com