భారత్ లో మళ్లీ కరోనా కేసుల కలకలం...

- August 09, 2023 , by Maagulf
భారత్ లో మళ్లీ కరోనా కేసుల కలకలం...

న్యూ ఢిల్లీ: భారత దేశంలో కరోనా మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. కరోనా అంతమైపోయిందని ప్రజలు ఉపశమనం పొందుతున్న వేళ మళ్లీ కరోనా మహమ్మారి పేరు వినిపిస్తోంది. కొత్త వేరియంట్ రూపంలో మళ్లీ దేశంలో కరోనా కలకలం ప్రారంభమైంది. కొత్తగా కేసులు కూడా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోనే కరోనా వైరస్ ఈజీ.5.1 కలవరపెడుతోంది. ఈ రకం కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ వైరస్‌ కేసులు జూలై చివరి నాటికి 70 ఉన్నాయని అవి ఆగస్టు 6 నాటికి 115కి పెరిగాయని వైద్యాధికారులు తెలిపారు. అత్యధికంగా ముంబై లో 43 కేసులు నమోదయ్యాయి. పూణేలో 34 కేసులు వెలుగులోకి రాగా.. థానేలో 25 చొప్పున యాక్టీవ్ కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. రాయ్‌గఢ్, సాంగ్లీ, షోలాపూర్, సతారా, పాల్ఘర్‌లలో ప్రస్తుతం ఒక్కొక్క యాక్టివ్ కేసులున్నాయి.

కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య రంగాన్ని అప్రమత్తం చేశారు. జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. కరోనా కొత్త రకం వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున మాస్కులు తరహా రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ వైరస్‌ వ్యాప్తి గురించి అప్పుడే ఒక అంచనాకు రాలేమని, దానికి ఇంకా సమయం పడుతుందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని ఇంకా పర్యవేక్షించవలసి ఉందన్నారు. కానీ మూడు నాలుగు రోజులుగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగినట్లు మాత్రం ఆ అధికారి తెలిపారు. మహారాష్ట్రలో చాలా కాలం తర్వాత మళ్లీ కరోనా కేసుల పెరుగుదల నమోదైంది. మే నెలలో మహారాష్ట్రలో EG.5.1 వైరస్‌ రకం కనుగొన్నామని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాజేష్ కార్యకార్టే తెలిపారు. 15 రోజులుగా కోవిడ్ కేసుల పెరుగుదలను గమనిస్తున్నామని, ఒక కరోనా మరణం కూడా నమోదైందని పూణేలోని నోబుల్ హాస్పిటల్‌ అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ అమీత్ ద్రవిడ్ తెలిపారు. EG.5.1 వైరస్‌ ఇటీవల బ్రిటన్‌లో తీవ్ర కలకలం సృష్టించింది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com